ఏదైనా చెప్పాలనుకుంటే మగవాళ్లతో చెప్పు.... ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఆడవాళ్లతోనే చెప్పు.. అంటుంది ఐరన్ లేడీ మార్గరెట్ థాచర్. చేతల్లో మనమేంటో నిరూపించుకోవాలంటే రాజకీయాలను మించిన వేదిక లేదు. ఈ రంగంలో మన వాటా పెరుగుతోందా? తగ్గుతోందా? ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలనే తీసుకుందాం.. బెంగాల్ బెబ్బులి మమత విజయం మనకి ఆనందమే. మరి ఆ స్ఫూర్తి... అన్ని చోట్లా ఉందా?
11… కేరళలో మహిళలు కైవసం చేసుకున్న అసెంబ్లీ సీట్ల సంఖ్య ఇది. గత ఎన్నికల్లో ఇది 8. అంటే కాస్త పెరిగాయి! సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి, 21 ఏళ్ల వయసులోనే తిరువనంతపురం మేయర్గా ఎంపికై దేశ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన ఆర్యా రాజేంద్రన్ వంటి వారే ఈ మార్పునకు కారణం కావొచ్చు.
40… కాళీమాతను పూజిస్తూ స్త్రీశక్తికి ప్రాధాన్యత ఇచ్చే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన మహిళల సంఖ్య ఇది. ఈ సారి పెద్ద మార్పు లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో 41 మంది గెలిచారు మరి!