రాష్ట్ర మంత్రివర్గంలో బెర్తుల కోసం పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుందోనని నిరీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కలిపి 18 మంది మంత్రివర్గంలో ఉండాలి. ఇప్పటికే 12 మంది ఉన్నందున.. మరో ఆరుగురికే అవకాశం ఉంటుంది. కేబినెట్లో ఇద్దరు మహిళలకు స్థానం కల్పిస్తామని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు. మహిళల కోటాలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, గొంగిడి సునీత, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆశలు పెట్టుకున్నారు. సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్కు పార్టీ కీలక నేతలు హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
కేబినెట్లోకి కవిత లేదా వినోద్!
మాజీ ఎంపీలు కవిత లేదా వినోద్ కుమార్లలో ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని కొన్ని రోజులుగా ఊహాగానాలు నెలకొన్నాయి. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చోటు కల్పిస్తామని కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాతో పాటు ఎస్సీ మాదిగ కోటాలో తెరాసకు మద్దతు ప్రకటించిన సండ్ర వెంకటవీరయ్యకు అవకాశం ఉండొచ్చునని చెబుతున్నారు. మంత్రివర్గంలో చోటు కోసం ఆశలు పెట్టుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి.. నల్గొండ ఎంపీగా టికెట్ ఇచ్చేందుకు తెరాస నాయకత్వం సిద్ధపడినప్పటికీ ఆయన వదులుకున్నారు. శాసనమండలిలో ఏర్పడిన మూడు ఖాళీల్లో ఒకటి గుత్తా సుఖేందర్ రెడ్డికి ఖాయమైనట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
హరీశ్, కేటీఆర్కు స్థానంపై ఊహాగానాలు