కొత్త రకం వైరస్పై రాష్ట్ర ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అభయమిచ్చారు. కేంద్రం సూచన మేరకు యూకే నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులను పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. కొత్త రకం వైరస్కు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని విభాగాధిపతులను అప్రమత్తం చేసినట్లు వివరించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా, రాష్ట్ర పర్యవేక్షణ బృందాలు విదేశాల నుంచి వచ్చిన వివరాలు సేకరించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు పర్యవేక్షిస్తారని వెల్లడించారు.
కొత్త వైరస్ రాకుండా ముందస్తు చర్యలు: శ్రీనివాసరావు
బ్రిటన్లో కొత్తరకం కరోనా వైరస్ వచ్చిన దృష్ట్యా రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. విదేశాల నుంచి హైదరాబాద్కు వస్తున్న వారిపట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. కొత్తరకం వైరస్పై కేంద్రం ఇప్పటికే సూచనలు చేసిందన్న ఆయన ఆ మేరకు అన్ని శాఖలను రాష్ట్రప్రభుత్వం అప్రమత్తం చేసిందన్నారు.
కొత్త రకం వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుందనే సమాచారం ఉన్నప్పటికీ తీవ్ర లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. వారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నందున... ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ వైరస్ అదుపులోనే ఉందన్నారు. వరుసగా క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి వేడుకలు వస్తున్నందున సాధ్యమైనంతవరకు కుటుంబసభ్యుల మధ్యే జరుపుకోవాలని వైద్యారోగ్య సంచాలకులు కోరారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
ఇదీ చూడండి:'కొత్త వైరస్ వచ్చిందని భయపడకండి.. అప్రమత్తంగా ఉండండి'