తెలంగాణ

telangana

By

Published : Nov 16, 2020, 7:05 AM IST

Updated : Nov 16, 2020, 7:15 AM IST

ETV Bharat / city

అంతర్జాలం అనుకూలించదు.. సాంకేతికత సహకరించదు!

మొక్కజొన్న విత్తనాలు ఎండబెట్టే పనిలో నిమగ్నమైన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన అన్నదమ్ములు కారింగుల భువనేశ్వర్‌, మణికంఠ. ఏపూరు ప్రాథమిక పాఠశాలలో 5, 4 తరగతులు చదువుతున్నారు. ఇంట్లో టీవీ లేదు. ‘నాన్న ఇంటివద్ద ఉన్నప్పుడు మాత్రం స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్నాం. ఆయన పనికెళ్తే ఆ అవకాశాన్నీ కోల్పోతున్నాం. ఉపాధ్యాయులు ఇంటికి వచ్చి పరిశీలిస్తున్నారు. ఎవరో ఒకరింట్లో కూర్చొని టీవీ పాఠాలు వినమని సలహా ఇస్తున్నారు. కానీ! పొరుగింట్లోని వాళ్లు దానికి అంగీకరించాలిగా!’’అని నిట్టూర్చారు.

ఆన్‌లైన్‌ పాఠాలకు దూరంగా గ్రామీణ విద్యార్థులు
ఆన్‌లైన్‌ పాఠాలకు దూరంగా గ్రామీణ విద్యార్థులు

కరోనా..విద్యా విధానంలో కొత్త ఒరవడిని సృష్టించింది. ఆన్‌లైన్‌, డిజిటల్‌ బోధనను అన్ని వర్గాల విద్యార్థులకు పరిచయం చేసింది. పట్టణ ప్రాంత విద్యార్థులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో పట్టున్న, అంతకుమునుపే డిజిటల్‌ తరగతులకు అలవాటుపడిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యాభాసాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు. గ్రామీణ, నిరుపేద కుటుంబాల్లోని పిల్లలు మాత్రం ఈ పరిణామాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యారు. టీవీ పాఠాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపినప్పటికీ, సరైన సదుపాయాల్లేని లక్షల మంది వాటికీ దూరమయ్యారు. ఏకపక్షంగా సాగే పాఠాలు అర్థం చేసుకునే సామర్థ్యాలు కొరవడి కొందరు..సందేహాలు తీర్చేవారు లేక గందరగోళానికి గురై ఇంకొందరు..టీవీ, సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ వంటివి కొనుక్కునే సామర్థ్యం లేక మరికొందరు.. ఇలా లక్షల మంది ప్రస్తుతం చదువుకు దూరంగా జరిగారు. ఇది మనవల్ల అయ్యే పని కాదులే అని కూలిపనులకు వెళ్తూ..బర్లు,గొర్లు కాస్తూ కాలం గడుపుతున్నారు.

టీవీ పాఠాలతో ఏం ఉపయోగం..?

‘ఈనాడు- ఈటీవీ భారత్​’ క్షేత్రస్థాయి పరిశీలన చేసినప్పుడు ఒక్కో గ్రామంలో లెక్కకుమిక్కిలి పిల్లలు పాఠాలు కొనసాగే సమయంలోనే పత్తిచేలలో, చేనేత మగ్గాల దగ్గర పనులు చేస్తూ కన్పించారు. రాష్ట్రంలో సెప్టెంబరు ఒకటి నుంచి టీవీ పాఠాలు మొదలయ్యాయి. ‘ఈనాడు- ఈటీవీ భారత్​’ యంత్రాంగం పలు గ్రామాల్లో పరిశీలించగా టీవీ పాఠాలు ప్రసారం అయ్యే సమయంలోనూ పలువురు విద్యార్థులు వాటిని వినకుండా పొలాల్లో ఉండటం, ఇంటి పనులు చేస్తుండటం కన్పించింది. ఈ పోకడ మారుమూల గ్రామాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా ఉంది. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలోని ఏజెన్సీ గ్రామాలైన మచ్చర్ల, మట్టెవాడ, ఊట్ల, నేలవంచ, కొంగరగిద్ద, దొరవారితిమ్మాపురం తదితర ప్రాంతాల్లోని విద్యార్థులు ఆన్‌లైన్‌ చదువుల గురించి అసలు పట్టించుకున్న దాఖలాలు కన్పించలేదు. బడికి వెళ్తేనే అంతంతమాత్రంగా చదువు వస్తోందని, రెండు గంటల టీవీ పాఠాలతో ఏం ఉపయోగం ఉంటుందన్న అభిప్రాయాన్ని ఎక్కువమంది తల్లిదండ్రులు వ్యక్తంచేశారు. అందుకే పిల్లల్ని పనులకు తీసుకెళ్తున్నట్టు వెల్లడించారు.

అందుకే పనులకు తీసుకెళ్తున్నాం..

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో ఆర్థిక స్థోమత లేని కుటుంబాలు తమ పిల్లలకు ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్లూ సమకూర్చలేదు. నానా తంటాలు పడి సమకూర్చినా సిగ్నల్స్‌ లేకపోవడం వంటి కారణాలతో పిల్లలు డిజిటల్‌ పాఠాలకు దూరంగా ఉంటున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వెలిబుచ్చారు. ‘గట్టు మండలంలో టీవీ పాఠాలు ప్రసారమైన తొలి రోజుల్లో సుమారు 50 శాతానికి పైగా విద్యార్థులు వాటిని వీక్షించారు. ఇప్పుడు ఆ సంఖ్య 30 శాతం కన్నా తక్కువగానే ఉన్నట్టు మా పరిశీలనలో తేలింది’ అని అక్కడి ఉపాధ్యాయులు తెలిపారు.

‘చాలామంది పిల్లలు పత్తి చేలలో పనులకు వెళ్తున్నారు. తల్లిదండ్రులను అడిగితే బడులు లేవు కదా? అందుకే పనులకు తీసుకెళ్తున్నాం. రోజుకు రూ.200 వస్తున్నాయనే సమాధానమిస్తున్నారు. - సంగారెడ్డి జిల్లా చిలప్‌చేడ్‌ మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు

ఇలా రాష్ట్రవ్యాప్తంగా వందలాది గ్రామాల్లో వేలాది విద్యార్థులు చదువులకు దూరమై, ఇతర పనులకు అలవాటుపడుతున్నారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే వారంతా అర్ధంతరంగా బడి మానేసే ప్రమాదం లేకపోలేదని ఉపాధ్యాయులు, విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఆ వాదనను పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు ఖండించారు. ‘అర్ధంతరంగా చదువు ఆపేసే వారు రాష్ట్రంలో అంతగా ఉండకపోవచ్చు. కనీసం 50 శాతం మంది మధ్యాహ్న భోజనం కోసం బడులకు వస్తున్నారు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

అధ్యయనాలూ హెచ్చరిస్తున్నాయి...
దీర్ఘకాలం బడులు మూతపడటం వల్ల భారీ సంఖ్యలో విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని, డ్రాపౌట్లు అధికమవుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భారత్‌లో ఈ ఏడాది 50లక్షల మందికిపైగా పాఠశాల విద్యార్థులు చదువు మానేయనున్నారని ప్రపంచ బ్యాంకు ఓ అధ్యయనం ద్వారా ఇప్పటికే హెచ్చరించింది. యంగ్‌ లైవ్స్‌ ఇండియా తాజా అధ్యయనం ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో 35 శాతం మంది పిల్లలు ఇతర కుటుంబ బాధ్యతలు తలకెత్తుకుంటున్నారని వెల్లడించింది. అంతర్జాలం సదుపాయం లేనివారు 72% మంది, టెక్నాలజీ వినియోగంలో నైపుణ్యం లేనివారు 42 శాతం మంది ఉన్నట్లు తెలిపింది.

కాపలా బడిలో కాలం గడుపుతూ..

పదో తరగతి విద్యార్థిని కొట్టెం సుప్రియ

మంచెపై కూర్చున్న ఈ విద్యార్థిని కొట్టెం సుప్రియ. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల శివారు కుమురంభీంగూడేనికి చెందిన ఈ బాలిక ములుగు మండలం మేడారం పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. స్మార్ట్‌ఫోన్‌ ఉన్నా సిగ్నల్‌ రాకపోయినందున ఆన్‌లైన్‌ తరగతులు వినడం, చూడటం సమస్యగా మారింది. దాంతో మరో విద్యార్థి చందు కలిసి తమ వరి పంటకు కాపలా కాస్తున్నట్టు విద్యార్థిని పేర్కొంది.

పత్తి ఏరడమే పాఠం..

ఏడో తరగతి విద్యార్థిని సురేఖ

బాలిక పేరు సురేఖ. ఊరు మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండల పరిధి సర్మోనికుంట తండా. టేక్మాల్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. కుటుంబానికి కొద్దిపాటి పొలం ఉంది. ఇంట్లో టీవీ లేనందున చదువు సాగడం లేదని, పత్తి ఏరే పనికి వెళ్తున్నానని సురేఖ వాపోయింది.

కూలి పనుల్లోనే..

పత్తి చేనులో పనిచేస్తున్న నలుగురు విద్యార్థులు

త్తి చేనులో పనిచేస్తున్న ఈ నలుగురూ విద్యార్థులే. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల శివారు కుమురంభీం నగర్‌కు చెందిన వీరి పేర్లు భూర్క స్వప్న(10వ తరగతి), కొట్టెం మల్లేశ్వరి(7వ తరగతి), స్నేహలత, దారం స్వాతి(ఇంటర్‌). ‘ఇంట్లో టీవీ లేదు. స్మార్ట్‌ఫోన్‌ కూడా లేదు. పక్కింటి వాళ్లు సెల్‌ఫోన్‌ ఇస్తామని చెప్పారు. దానికీ సిగ్నల్‌ రావడం లేదు. ఇంటివద్ద ఉండలేక తల్లిదండ్రులకు తోడుగా కూలి పనులకు వెళ్తున్నాం’ అని వారు తెలిపారు.

ఎద్దుల సంరక్షణ నాదే

ఎద్దుల్ని మేపుతున్న శివ

ద్దుల్ని మేపుతున్న ఈ కుర్రాడి పేరు శివ. గద్వాల జిల్లా, గట్టు మండలం గట్టు ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఫోన్‌ కొనుక్కునే స్థోమతలేక ఆన్‌లైన్‌ పాఠాలకు దూరమయ్యాడు. అమ్మానాన్నలు పనులకు వెళ్తూ..ఎద్దుల్ని సంరక్షించే పనిని అప్పగించారని, రోజూ వాటిని పొలానికి తీసుకెళ్లి మేపి ఇంటికి తీసుకొస్తున్నానని విద్యార్థి వాపోయాడు.

ఇవీ చూడండి:చూపరులను అలరించిన దున్నపోతుల విన్యాసాలు

Last Updated : Nov 16, 2020, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details