తెలంగాణ

telangana

రిజర్వేషన్ల ఖరారుకు రంగం సిద్ధం

By

Published : Jan 4, 2020, 4:44 AM IST

Updated : Jan 4, 2020, 7:47 AM IST

పురపోరులో కీలకమైన రిజర్వేషన్ల అంశం ఇవాళ ఓ కొలిక్కి రానుంది. వార్డుల వారీ ఓటర్ల తుదిజాబితా ప్రకటనతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల వివరాలు కూడా ఇవాళ తేలనున్నాయి. ఏ వర్గానికి ఎన్ని పదవులు దక్కుతాయన్న విషయంపై స్పష్టత రానుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం బీసీలకు 32 నుంచి 35 శాతం వరకు రిజర్వేషన్లు దక్కే అవకాశం కనిపిస్తోంది.

muncipal elections in telangana
రిజర్వేషన్ల ఖరారుకు రంగం సిద్ధం

రిజర్వేషన్ల ఖరారుకు రంగం సిద్ధం

పురపాలక ఎన్నికల ముందస్తు ప్రక్రియ ఇవాళ్టితో దాదాపుగా పూర్తి కానుంది. వార్డుల వారీ ఓటర్ల తుదిజాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించనుంది. ఎన్నికలు జరగనున్న పది కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో వార్డుల వారీ ఓటర్ల ముసాయిదా జాబితాను గత నెల 30వ తేదీన విడుదల చేశారు. అదే రోజు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది. ఓటర్ల జాబితాతో పాటు ఓటర్ల గుర్తింపు పరంగా తప్పులు దొర్లాయంటూ చాలా ఫిర్యాదులు వచ్చాయి. దాదాపుగా అన్ని చోట్లా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మొత్తం 2,700కు పైగా అభ్యంతరాలు, వినతులు వచ్చినట్లు సమాచారం.

ఓ వర్గానికి ఎన్ని పదవులు...

వాటన్నింటిని అధికారులు పూర్తి చేశాక తుదిజాబితాలు ప్రకటించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల తుది వివరాలు కూడా ఇవాళ వెల్లడవుతాయి. వాటి ఆధారంగా మేయర్, ఛైర్మన్ పదవుల, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఏ వర్గానికి ఎన్ని పదవులు రిజర్వ్ అవుతాయన్న విషయమై ఇవాళ స్పష్టత రానుంది. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియకు సంబంధించి జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో పురపాలక శాఖ సంచాలకులు శ్రీదేవి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించారు. 2011 జనాభా ప్రాతిపదికన ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని తెలిపారు. ఆ తర్వాత 50 శాతానికి మించకుండా బీసీ రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎస్టీలకు మూడు శాతం వరకు, ఎస్సీలకు 12శాతం వరకు రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంది. 50శాతంలో మిగిలిన రిజర్వేషన్లు బీసీలకు దక్కుతాయి.

మహిళలకుసగం సీట్లు

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం బీసీలకు 32 శాతం నుంచి గరిష్ఠంగా 35 శాతం రిజర్వేషన్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా అవరోహణ క్రమంలో ఎస్టీలకు సీట్లను రిజర్వ్ చేస్తారు. ఆ తర్వాత ఎస్సీలకు, అనంతరం బీసీలకు సీట్లను రిజర్వ్ చేస్తారు. అన్ని కేటగిరీల్లోనూ మహిళలకు సగం సీట్లను లాటరీ పద్ధతిన కేటాయిస్తారు. మేయర్లు, ఛైర్​పర్సన్ల రిజర్వేషన్లు రాష్ట్ర స్థాయిలో... వార్డుల వారీ రిజర్వేషన్లు జిల్లా స్థాయిలో ఖరారు చేస్తారు. ఇందుకోసం ఈ నెల ఐదు, ఆరు తేదీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తుది రిజర్వేషన్లు ఖరారు చేస్తారు.

ఇవీ చూడండి: ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి​తో భాజపా బృందం భేటీ

Last Updated : Jan 4, 2020, 7:47 AM IST

ABOUT THE AUTHOR

...view details