Harish Rao Comments on NITI Ayog: నీతిఆయోగ్ రాజకీయ రంగు పులుముకుందని మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. భాజపాకు వంతపాడుతూ నీతిఆయోగ్ నోట్ రిలీజ్ చేయడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటిస్తూ.. నిన్న సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలపై సర్వత్రా దుమారం చెలరేగింది. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. నీతిఆయోగ్ నోట్ విడుదల చేయటం మరింత చర్చకు దారి తీసింది. కాగా.. నీతిఆయోగ్ విడుదల చేసిన నోట్పై మంత్రి హరీశ్రావు తీవ్రంగా స్పందించారు. సీఎం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పోయి తప్పుడు ప్రకటన చేశారని నీతిఆయోగ్పై మంత్రి మండిపడ్డారు. ఆ సంస్థ అంకెలా గారడీ చేస్తూ.. వాస్తవాలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. నిధులు ఇచ్చినా వాడుకోలేదని నీతిఆయోగ్ తప్పుడు ప్రకటన చేసిందన్న హరీశ్రావు.. ఆ సంస్థ చెప్పినా కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.
ఇందిరాగాంధీ, వాజ్పేయి, మన్మోహన్ ప్రభుత్వాలు ఆర్థిక సంఘం సిఫార్సులను కచ్చితంగా అమలు చేశాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు. ప్రగతి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణపై ద్వేషం ఎందుకు..? అని మంత్రి ప్రశ్నించారు. ఆర్థిక సంఘం సిఫార్సులను మోదీ ప్రభుత్వం అమలు చేయలేదన్న హరీశ్రావు.. దానిపై నీతిఆయోగ్ ఎందుకు ప్రశ్నించదని అడిగారు. నీతి అయోగ్ ప్రకటన సత్యదూరమని ఆరోపించిన మంత్రి.. కేసీఆర్ అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు. నీతిఆయోగ్ సిఫార్సులను కేంద్రం చెత్తబుట్టలో వేసిందన్నారు. కేంద్రం సెస్లను 10 నుంచి 20 శాతానికి పెంచుకుని.. రాష్ట్రాలకు నిధులు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెస్ల ద్వారా కేంద్రం 15.47 లక్షల కోట్లు సమకూర్చుకుందని.. అందులో రాష్ట్రాల వాటా 8.60 లక్షల కోట్లు రావాలన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్రాలకు 29.6 శాతమే ఇస్తోందని దుయ్యాబట్టారు.