సంచలనం సృష్టించిన గట్టు వామన్రావు దంపతుల హత్య కేసు దర్యాప్తును స్థానిక పోలీసులే పూర్తిచేయనున్నారు. వీలైనంత త్వరగా అభియోగపత్రాలు దాఖలు చేయాలని భావిస్తున్న అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెనుదుమారం రేపిన ఈ జంట హత్యల కేసును సీబీఐకి అప్పగించాలని, ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుచేయాలని న్యాయవాదులు, రాజకీయ పక్షాలు డిమాండు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ హత్యల్లో రాజకీయ నాయకుల ప్రమేయంతో పాటు పోలీసుల పాత్రపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జంట హత్యల కేసును స్థానిక పోలీసులకు కాకుండా సీబీఐకి అప్పగించాలని, లేదంటే ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయాలని పలువురు డిమాండు చేశారు. ఉన్నతాధికారులు మాత్రం ఈ కేసు దర్యాప్తునకు స్థానిక పోలీసులు సరిపోతారని భావిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి పర్యవేక్షణ
సాధారణంగా జంట హత్యల కేసు దర్యాప్తు సీఐ స్థాయి అధికారి చూస్తారు. కానీ, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేసు కావడంతో ఇక్కడ డీఎస్పీ స్థాయి అధికారికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించామని, ఆయనపై మరో పర్యవేక్షణాధికారి ఉంటారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. కేసు కోణంలో చూస్తే అంతా స్పష్టంగానే ఉందని, హత్యలకు పాల్పడ్డవారు, వారికి సహకరించిన వారు దొరికిపోయారని, వీడియో సహిత ఆధారాలు లభించాయని, చనిపోయే ముందు వామన్రావు వెల్లడించిన వివరాలు సైతం అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ఇంకా దీని వెనుక ఎవరైనా ఉంటే తప్పక పట్టుబడతారని, కేసు ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం అవసరం కనిపించడం లేదని ఆయన స్పష్టం చేశారు. వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, త్వరలోనే అభియోగపత్రాలు దాఖలు చేయడం ద్వారా విమర్శలకు చెక్ పెట్టవచ్చని, వీలైతే ఫాస్ట్ట్రాక్ న్యాయస్థానంలో విచారణ జరిపించాలని భావిస్తున్నారు. దర్యాప్తు జరుగుతున్న తీరును హైదరాబాద్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
వామన్రావు శరీరంపై 14 గాయాలు?
న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్య కేసులో కీలకమైన శవ పరీక్ష నివేదిక సోమవారం పోలీసుల చేతికి అందనుంది. ఇది విచారణను వేగవంతం చేయడానికి దోహదపడనుంది. ఘటన ఎప్పుడు జరిగింది.. ఎంతసేపటికి అంబులెన్స్ అక్కడికి చేరుకుంది.. క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకురావడానికి ఎంత సమయం పట్టింది.. దంపతులు ఘటనా స్థలంలోనే మృతి చెందారా.. ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గంమధ్యలో ప్రాణాలు వదిలారా.. వంటి సందేహాలకు తెరపడే అవకాశముంది. మృతదేహాలకు గురువారం ఉదయం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో శవ పరీక్షలు నిర్వహించారు.