తెలంగాణ

telangana

By

Published : Jan 18, 2021, 8:40 PM IST

ETV Bharat / city

పాడైపోతున్న అమ్మవారి ప్రసాదం.. కాపాడలేక సిబ్బంది పాట్లు

ఏపీలోని విజయవాడ దుర్గగుడిలో భవానీ దీక్షల విరమణ కోసం వచ్చే భక్తుల కోసం తయారుచేసిన లడ్డూ ప్రసాదాలు భారీగా మిగిలిపోయాయి. వాటిని విక్రయించిన తర్వాతే ప్రసాదాల తయారీ చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. దీంతో గట్టిగా మారుతున్న లడ్డూల అమ్మకాలపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదం పాడైపోకుండా ఉండేలా చూసేందుకు సిబ్బంది నానాపాట్లు పడుతున్నారు.

పాడైపోతున్న అమ్మవారి ప్రసాదం.. సిబ్బంది నానాపాట్లు
పాడైపోతున్న అమ్మవారి ప్రసాదం.. సిబ్బంది నానాపాట్లు

ఏపీలోని విజయవాడ దుర్గగుడిలో భవానీ దీక్షల కోసం తయారు చేసిన లడ్డూ ప్రసాదం భారీగా మిగిలిపోయింది. వాటిని విక్రయించిన తర్వాతే మళ్లీ ప్రసాదాల తయారీ చేపట్టాలని నిర్ణయించారు. ఉత్సవాలు ముగిసి ఇప్పటికి తొమ్మిది రోజులు గడుస్తున్నా లడ్డూ ప్రసాదం అమ్మకాలు పూర్తికాలేదు. ఆదివారం నాటికి ఇంకా 50వేలకు పైగా లడ్డూ ప్రసాదం మిగిలి ఉంది. ఇవన్నీ అమ్మాలంటే కనీసం మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది. ఈలోగా ప్రసాదం పాడైపోకుండా ఉండేలా చూసేందుకు సిబ్బంది నానాపాట్లు పడుతున్నారు. ఇప్పటికే లడ్డూలు గట్టిగా అయిపోయాయి. సాధారణంగా రెండు రోజులకు ఒకసారి దుర్గగుడిలో లడ్డూ ప్రసాదం తయారు చేస్తుంటారు. ప్రస్తుతం ఈనెల 8నుంచి ప్రసాదాల తయారీని ఆపేశారు. పులిహోర ప్రసాదం కూడా తయారు చేయడం లేదు. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు గట్టిగా మారిపోయిన ఈ లడ్డూ ప్రసాదమే కొనుక్కుని వెళ్లాల్సి వస్తోంది.

రెండు లక్షలకు పైగా లడ్డూల మిగులు..

దుర్గగుడిలో జనవరి 5 నుంచి 9 వరకు భవానీదీక్షల వేడుకలు జరిగాయి. ఐదు రోజులకు కలిపి ఎనిమిది లక్షల లడ్డూలు తయారు చేయాలని నిర్ణయించారు. మొదటి రెండు రోజులకు లక్ష చొప్పున సిద్ధం చేశారు. తర్వాత మూడు రోజులకు రెండు లక్షల చొప్పున తయారు చేయాలని నిర్ణయించారు. కానీ.. భవానీదీక్షల్లో భక్తుల రద్దీ బాగా తగ్గిపోవడంతో తయారు చేసిన లడ్డూ ప్రసాదం అమ్మకం కాలేదు. అప్పటికీ అనుకున్న అంచనా కంటే ఒక లక్ష తక్కువగా ఏడు లక్షలే చేశారు. వాటిలో ఐదు లక్షలు మాత్రమే అమ్మగలిగారు. రెండు లక్షలకు పైగా లడ్డూలు మిగిలిపోయాయి. భవానీ దీక్షల తరువాత నుంచి ఆదివారం వరకు ఎనిమిది రోజుల్లో లక్షన్నర లడ్డూలను అమ్మారు. పండుగ రద్దీ గత నాలుగు రోజులుగా ఆలయానికి ఎక్కువగా ఉండడంతో లక్షన్నరైనా అమ్మగలిగారు. ప్రస్తుతం సాధారణ రోజుల్లో 10 నుంచి 15వేల మంది భక్తులు మాత్రమే ఆలయానికి వస్తున్నారు. శని, ఆదివారాల్లో 20వేల నుంచి 25వేల మంది వస్తున్నారు. అందుకే.. ప్రసాదాల విక్రయాలు నెమ్మదిగా జరుగుతున్నాయి.

గాలి తగిలేలా ఉంచడంతో..

భవానీ దీక్షల తర్వాత లడ్డూ ప్రసాదం భారీగా మిగిలిపోవడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. తయారుచేసిన ప్రసాదాన్ని ట్రేల్లోనే గాలి తగిలేలా ఉంచారు. ప్యాకింగ్‌ చేస్తే ప్రసాదం మూడు నాలుగు రోజుల్లో పాడైపోతుంది. నాలుగేళ్ల కిందట దసరా ఉత్సవాల సమయంలో ఇలాగే భారీగా లడ్డూ ప్రసాదం మిగిలిపోయింది. అన్నింటినీ ప్యాకింగ్‌ చేయడంతో పాడైపోయాయి. వాటిని గుట్టుచప్పుడు కాకుండా పారబోశారు. ప్రస్తుతం ముందుగానే అప్రమత్తమై ట్రేల్లోనే ఉంచడంతో లడ్డూలు గట్టిగా మారినా పాడవ్వలేదు. అయితే.. ఈ ప్రసాదాన్ని కౌంటర్లలో విక్రయించేటప్పుడు భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.15కు 80గ్రాముల లడ్డూ ఇవ్వాలి. తడి ఆరిపోవడంతో లడ్డూల బరువు కూడా తగ్గిపోయాయి. తాజాగా శని, ఆదివారాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. గట్టిగా ఎండిపోయిన లడ్డూలు ఇస్తుంటే.. తాజాగా ఉన్నవి ఇవ్వాలంటూ పలువురు భక్తులు నిలదీశారు. దీంతో ఏం చెప్పాలో తెలియని పరిస్థితి కౌంటర్లలో ఉండే సిబ్బందికి ఎదురవుతోంది.

ఇదీ చదవండి:బయో ఆసియా సదస్సు పోస్టర్​ను ఆవిష్కరించిన కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details