తెలంగాణ

telangana

ICRISAT Hyderabad Golden Jubilee : పరిశోధనల క్షేత్రం.. చరిత్రకు సాక్ష్యం

By

Published : Feb 3, 2022, 10:46 AM IST

ఇక్రిశాట్‌.. ఈపేరు వినగానే సమశీతోష్ణ మండలాల్లో పండే పంటల పరిశోధన కేంద్రమని చాలా మంది ఠక్కున చెప్పేస్తారు. ఎన్నో నూతన వంగడాలు ఇక్కడ పురుడు పోసుకున్నాయని వివరిస్తారు. పక్కపక్కనే నల్లరేగడి, ఎర్రనేలలుండటమే కాదు.. ఈ నేలల కింద మనదైన గొప్ప చరిత్ర ఆనవాళ్లున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో జైనం వర్ధిల్లింది. ఆ తర్వాత వీరశైవం తన ప్రాభవాన్ని కొనసాగించింది. పశ్చిమ చాళక్యుల పరిపాలన కాలంలో పటాన్‌చెరును ‘పొత్తలకెరె’ అని పిలిచేవారనే ఆధారాలూ ఇక్కడ లభించాయి. కొత్తరాతియుగంలో వాడిన పనికరాలూ దొరికాయి. ఇక్రిశాట్‌ ఏర్పాటై 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలు చేసుకునే వేళలో.. ఈ చరిత్ర గురించి మనమూ తెలుసుకుందాం.

ICRISAT Hyderabad Golden Jubilee
ICRISAT Hyderabad Golden Jubilee

50 ఏళ్ల క్రితం..

1972లో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఇక్రిశాట్‌ ఏర్పాటైంది. ఈ ప్రాంతంలో అంతకుపూర్వం కాచిరెడ్డిపల్లి, మన్మోల్‌ గ్రామాలుండేవి. వారిని ఖాళీ చేయించి దీనిని నిర్మించారు. ఆ సందర్భంగా తవ్వకాలు జరుపుతుండగా తొలుత అయిదు టన్నుల బరువున్న వినాయకుడి విగ్రహం లభించింది. హిందువులు ఏదైనా పని చేపట్టేందుకు విఘ్నాలు రాకుండా ఉండాలని వినాయకుడిని పూజిస్తారు. సంస్థ ప్రారంభంలోనే ఈ విగ్రహం లభించడంతో శుభసూచకంగా భావించారు. అప్పటి డైరెక్టర్‌ రాల్ఫ్‌ డబ్ల్యూ కమ్మిన్స్‌ చరిత్ర ఆనవాళ్లను వెలికితీసేలా తవ్వకాలు జరిపించారు. ఈ వినాయక విగ్రహం దాదాపు వెయ్యి ఏళ్ల క్రితందని గుర్తించారు. దీనిని జైనులు పూజించినట్లు శిల్పకళ ద్వారా తెలుస్తోంది.

ఆ తర్వాత వైష్ణవ శిల్పం, ద్వారపాలికలు, హనుమంతుడు, వీరగల్లు, వీరభద్రుడు, జైనయక్షిణులు.. ఇలా చాలా విగ్రహాలు లభించాయి. వీటిలో కొన్ని దెబ్బతిన్నాయి. 12వ శతాబ్దంలో వీరశైవం ప్రాభవమున్న సమయంలో జైనుల బసదుల స్థానాల్లో శైవాలయాలు నిర్మించినట్లు ఇక్కడి చరిత్ర చెబుతోంది. ఇక్రిశాట్‌ ఆవరణలో ఒక చెట్టు కింద ఉన్న ఆలయంలో జైనులు నిర్మించిన హోమగుండంతో పాటు శివుడి విగ్రహం ఉన్నాయి. సూర్యదేవాలయంతో పాటు మూడు, నాలుగు కిలోమీటర్ల పరిధిలో చాలా ఆలయాలు ఉన్నట్లు గుర్తించారు. బౌద్ధానికీ పటాన్‌చెరు కేంద్రంగా ఉండేది.

పన్నుల వసూలు కేంద్రంగా కోట..

నంది విగ్రహం
శిల్పం

16వ శతాబ్దంలో కులీకుతుబ్‌షాల కాలంలో మన్మోల్‌ గ్రామంలో కోట నిర్మించారు. దీనిని పన్నుల వసూలు కేంద్రంగా, వేటకు వెళ్లినప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించేవారు. ఇక్కడ ప్రాచీన కన్నడలో లిఖించిన ఒక శాసనం దొరికింది. ఇది 11వ శతాబ్దం నాటిది. ఇలా ఇక్కడ దొరికిన శిల్పాలు, విగ్రహాలు, ఇతర వస్తువులను భద్రపరిచారు. ఇక్రిశాట్‌ ప్రాంగణంలో చాలా చోట్ల ఇవి మనకు దర్శనమిస్తాయి. వాటి చరిత్ర గురించి ఇక్కడికి వచ్చిన సందర్శకులు తెలుసుకునేలా తగిన ఏర్పాట్లు చేశారు. ఒక పెద్దవృక్షం కింద గద్దెను నిర్మించి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. క్యాంటిన్‌, పరిపాలన భవనం, లాబీల్లో విగ్రహాలను ప్రదర్శనగా ఉంచారు. మన్మోల్‌, కాచిరెడ్డిపల్లి గ్రామాల్లో రైతులు ధాన్యం నిల్వ చేసుకునేందుకు ఉపయోగించిన గాదెలూ ఇక్కడ మనకు కనిపిస్తాయి. సజ్జ, సెనగ, వేరుశనగ, జొన్న, కంది పంటలపై గొప్ప పరిశోధనలు జరిగే ఈ ప్రాంతం.. ఒకప్పుడు గొప్ప చరిత్రకు నిలయంగా ఉండేది. ఇప్పటికీ అప్పుడప్పుడు ఆనాటి ఆనవాళ్లు వెలుగు చూస్తుంటాయి.

శిల్పాలు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details