Governor tamilisai about midhani: రక్షణ రంగంలోని ఉత్పత్తుల స్వావలంబనకు హైదరాబాద్లోని మిధాని కీలక పాత్ర పోషిస్తోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. ఈ ప్రక్రియలో మిశ్ర ధాతు నిగమ్- మిధాని పాత్ర వెలకట్టలేనిదని ప్రశంసించారు. మిధానిలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన మిధాని ఉత్పత్తుల ప్రదర్శనను గవర్నర్ తిలకించారు. రక్షణ రంగంతో పాటు ఇతర రంగాలకు మిధాని అందిస్తున్న సేవలను తమిళిసై కొనియాడారు.
రక్షణ పరికరాలు, ఇతర వ్యూహాత్మక లోహాల విషయంలో దేశం స్వావలంబన సాధించేందుకు మిధాని అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. చాలా క్లిష్టమైన వస్తువులను అందించటంలో సంస్థ అద్భుతమైన సహకారం అందిస్తున్నట్లు వివరించారు. విస్తృత శ్రేణి లోహాలు, మిశ్రమాల తయారీలోనూ మిధాని కృషి వెలకట్టలేనిదన్నారు. టైటానియం బయో మెడికల్ ఇంప్లాంట్లను ఉత్పత్తి చేయడంలో అందించిన సహకారం పట్ల గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నామమాత్రపు ఛార్జీలతో బయోమెడికల్ ఇంఫ్లాంట్లను సరఫరా చేయడం ప్రశంసనీయమన్నారు.