గ్రేటర్ హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. అందులో భాగంగానే ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ అసెట్స్ ప్రొటెక్షన్ సెల్కు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నారంటూ.. భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. సెల్ ఏర్పాటైన రెండు నెలల్లోనే పలు పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మిస్తున్న ఇళ్లను జీహెచ్ఎంసీ కూల్చేసింది. ఈ ఏడాది జూన్ 6 నుంచి ఏపీసీ (అసెట్స్ ప్రొటెక్షన్ సెల్) సేవలు మొదలు కాగా సెప్టెంబర్ 6 వరకు 294 ఫిర్యాదులు అందాయి. అందులో దాదాపు 90 శాతం ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ పూర్తయిందని ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ విశ్వజిత్ అన్నారు.
జంట నగరాల నుంచి మొత్తం రెండు నెలల్లో 294 ఫిర్యాదులు రాగా.. వాటిలో చెరువుల కబ్జాపై 68, పార్కుల కబ్జాపై 94, ప్రభుత్వ ఖాళీస్థలాల కబ్జాపై 132 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఇప్పటికే 4 ఇళ్లను కూల్చివేయగా... 2 పార్కు స్థలాలను జీహెచ్ఎంసీ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇంకో 16 స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు విశ్వజిత్ తెలిపారు. ప్రాంతాల వారిగా చూస్తే.. ఎల్బీనగర్ జోన్ నుంచి 68 ఫిర్యాదులు రాగా 6 ఫిర్యాదులకు సంబంధించి చర్యలు మొదలయ్యాయి. చార్మినార్ జోన్లో 32 ఫిర్యాదులు రాగా ఒకటి కూల్చివేశారు. మరొకటి ప్రాసెస్లో ఉంది. సికింద్రాబాద్ జోన్లో 29 ఫిర్యాదులు రాగా ఒకటి కూల్చివేశారు. మరో రెండు ఫిర్యాదులు పరిశీలనలో ఉన్నాయి. ఖైరతాబాద్ జోన్లో 35 ఫిర్యాదులు రాగా ఒక ఫిర్యాదు అధికారుల పరిశీలనలో ఉంది. కూకట్పల్లి జోన్లో 54 ఫిర్యాదులు రాగా ఒక పార్కు స్వాధీనం చేసుకున్నారు. మరో 5 ఫిర్యాదులు పరిశీలనలో ఉన్నాయి. శేరిలింగంపల్లి జోన్లో మొత్తం 76 ఫిర్యాదులు వచ్చాయి. అందులో ఒక పార్కును కబ్జా కోరుల చెర నుంచి విడిపించగా మరొక ఫిర్యాదు పరిష్కారం దిశగా సాగుతోంది.