తెలంగాణ

telangana

By

Published : Nov 23, 2020, 2:55 PM IST

Updated : Nov 23, 2020, 4:47 PM IST

ETV Bharat / city

తెరాస గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల... ముఖ్యాంశాలివే

గ్రేటర్ మేనిఫెస్టో విడుదల
గ్రేటర్ మేనిఫెస్టో విడుదల

14:47 November 23

తెరాస గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం కేసీఆర్

తెరాస గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. ప్రపంచంలో నలుమూలల నుంచి ఎవరొచ్చినా అక్కున చేర్చుకున్న నగరం హైదరాబాద్ అని ఆయన అన్నారు. 

తాగునీటిపై...

       నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటి సరఫరా చేస్తామని సీఎం తెలిపారు. నెలకు 20 వేల లీటర్ల లోపు నల్లా వినియోగించే గృహాలకు ఉచితంగా నీటి సరఫరా అందిస్తామని స్పష్టం చేశారు. డిసెంబరు నుంచే ఉచితంగా నీటి సరఫరా చేస్తామన్నారు. 97 శాతం ప్రజలు నీటి బిల్లులు చెల్లించే అవసరం లేదని పేర్కొన్నారు.  

ఉచిత విద్యుత్...

        రాష్ట్రవ్యాప్తంగా క్షౌరశాలలు, సెలూన్లకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. లాండ్రీలు, దోబీఘాట్‌లకు ఇది వర్తిస్తుందని ప్రకటించారు. కరోనా కాలానికి మోటారు వాహన పన్ను రద్దు చేస్తామన్నారు.  

సినిమాకు సాయం...

      పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు హెచ్‌టీ, ఎల్టీ కేటగిరీలకు కనీస డిమాండ్ ఛార్జీల మినహాయింపు ఇస్తామన్న సీఎం... రాష్ట్రంలో సినిమా థియేటర్లకు హెచ్‌టీ, ఎల్టీ కేటగిరీ కనెక్షన్లకు విద్యుత్ కనీస డిమాండ్ ఛార్జీలు రద్దు చేస్తామని ప్రకటించారు. రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్‌మెంట్ సహాయం అందిస్తామని తెలిపారు.  

సినిమాపై మీ ఇష్టం...

        అన్ని సినిమా థియేటర్లలో షోలు పెంచేందుకు అనుమతిచ్చారు సీఎం కేసీఆర్‌. మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ తరహాలో టిక్కెట్ల ధరలు సవరించుకునే వెసులుబాటు కల్పించారు. థియేటర్లను ఎప్పుడైనా తెరుచుకోవచ్చు.. నిర్ణయాధికారం సినీ పరిశ్రమదే అని తెలిపారు.  

మూసీలో బోటింగ్...  

          త్వరలోనే కేశవాపురం జలాశయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. రూ.13 వేల కోట్ల అంచనా వ్యయంతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక చేసినట్లు కేసీఆర్‌ వివరించారు. మూసీతో గోదావరి నీటిని అనుసంధానించి ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు. బాపుఘాట్ నుంచి నాగోల్ వరకు మూసీ నది మధ్యలో బోటింగ్ నిర్వహించేలా చేస్తామన్నారు.

మెట్రో రెండోదశ...

      హైదరాబాద్ మెట్రో రెండో దశను విస్తరిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయం, బీహెచ్ఈఎల్ నుంచి మెహదీపట్నం వరకు మెట్రో రైలును విస్తరిస్తామని వెల్లడించారు. నగరంలోని ప్రధాన కేంద్రాల నుంచి విమానాశ్రయానికి ఎక్స్‌ప్రెస్ మెట్రో రైలు విస్తరించేలా పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ఎంఎంటీఎస్ కూడా...

      మరో 90 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్ రైళ్ల విస్తరణ చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్‌ వివరించారు. మెట్రో రైలు విస్తరణకు అవకాశం లేని ప్రాంతాల్లో ఎలివేటెడ్ బీఆర్‌టీఎస్​తో పాటు ప్రాంతీయ బాహ్యవలయ రహదారి (రీజినల్ రింగ్‌రోడ్‌)ను నిర్మిస్తామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేని నగరంగా ఫుట్‌పాత్‌లు, స్కైవాక్‌లు, సైకిల్ ట్రాక్‌ల నిర్మాణం చేపడతామని కేసీఆర్‌ వెల్లడించారు.

మరో మూడు టిమ్స్...

    నగరం చుట్టూ మరో 3 టిమ్స్ ఆస్పత్రులు నెలకొల్పుతామని సీఎం హామీ ఇచ్చారు. బస్తీ దవాఖానాల్లో డయాగ్నస్టిక్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు.  

నగరంలో 2 లక్షల ఇళ్లు...

     నగరంలో లక్ష రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి సంకల్పించినట్లు సీఎం చెప్పుకొచ్చారు. అతి త్వరలోనే దశలవారీగా ఇళ్లను పేదలకు అందిస్తామన్నారు. కొల్లూరు వద్ద 60 వేల ఇళ్లతో అతిపెద్ద టౌన్‌షిప్ ఆవిష్కృతం కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

క్రమబద్ధీకరణ...

       ప్రభుత్వ జాగాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాల క్రమబద్ధీకరిస్తామని కేసీఆర్‌ అన్నారు. సొంత జాగా ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి రూ.5 లక్షల వరకు ఆర్థికసాయం అందజేస్తామన్నారు.

ఈ- లైబ్రరీలు...

       విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఇంటర్‌నెట్ సౌకర్యంతో ఈ-లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పుకొచ్చారు. వయోజనుల కోసం ప్రతి డివిజన్‌లో లైబ్రరీ, క్లబ్, యోగా సెంటర్, జిమ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. వయోజనులకు ఉచితంగా బస్‌ పాస్‌లు అందజేస్తామన్నారు.

కేంద్రంపై విమర్శలు...

     మెట్రో నగరాలకు ఏటా రూ.6 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగినా.. పట్టించుకోలేదని సీఎం ఆరోపించారు. జీహెచ్ఎంసీలో ఇతర పార్టీలు గెలిచినా ఉపయోగం ఉండదని తేల్చిచెప్పారు.

రూ. 10 సాయం ఎక్కడాలేదు...

     గతంలో ఎన్నో నగరాల్లో వరదలు వచ్చినా ఎక్కడా రూ.10 వేల సాయం చేయలేదని కేసీఆర్ వివరించారు. కొంతమంది ఫిర్యాదుతో ఎస్‌ఈసీ ఒత్తిడికిలోనై వరదసాయం ఆపేసిందని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత మిగిలిన వారికి వరదసాయం తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు.

ఎలాంటి హైదరాబాద్ కావాలి..?

ప్రశాంత హైదరాబాద్ కావాలా.. కల్లోల హైదరాబాద్ కావాలా? ప్రజలే తేల్చుకోవాలని సీఎం అన్నారు. హైదరాబాద్‌లో కల్లోలం చెలరేగితే.. స్థిరాస్తి రంగం కుదేలవుతుందన్నారు. టీఎస్ బీపాస్ కావాలా.. కర్ఫ్యూ పాస్ కావాలా? అని ప్రశ్నించారు.

అట్టర్ ఫ్లాప్...

దేశాన్ని పాలించిన రెండు పార్టీలు అట్టర్‌ఫ్లాప్‌ అయ్యాయని సీఎం విమర్శలు గుప్పించారు.  దేశ ఆర్థిక వ్యవస్థను రెండు పార్టీలు నాశనం చేశాయని ఆరోపించారు. ఎల్‌ఐసీ వంటి సంస్థలను అమ్మే అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కలిసివచ్చే పార్టీలతో త్వరలో జాతీయ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. 

ఇదీ చూడండి:సీఎం చెప్పారు.. మరి థియేటర్లు తెరుస్తారా?

Last Updated : Nov 23, 2020, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details