తెరాస గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. ప్రపంచంలో నలుమూలల నుంచి ఎవరొచ్చినా అక్కున చేర్చుకున్న నగరం హైదరాబాద్ అని ఆయన అన్నారు.
తాగునీటిపై...
నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటి సరఫరా చేస్తామని సీఎం తెలిపారు. నెలకు 20 వేల లీటర్ల లోపు నల్లా వినియోగించే గృహాలకు ఉచితంగా నీటి సరఫరా అందిస్తామని స్పష్టం చేశారు. డిసెంబరు నుంచే ఉచితంగా నీటి సరఫరా చేస్తామన్నారు. 97 శాతం ప్రజలు నీటి బిల్లులు చెల్లించే అవసరం లేదని పేర్కొన్నారు.
ఉచిత విద్యుత్...
రాష్ట్రవ్యాప్తంగా క్షౌరశాలలు, సెలూన్లకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. లాండ్రీలు, దోబీఘాట్లకు ఇది వర్తిస్తుందని ప్రకటించారు. కరోనా కాలానికి మోటారు వాహన పన్ను రద్దు చేస్తామన్నారు.
సినిమాకు సాయం...
పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు హెచ్టీ, ఎల్టీ కేటగిరీలకు కనీస డిమాండ్ ఛార్జీల మినహాయింపు ఇస్తామన్న సీఎం... రాష్ట్రంలో సినిమా థియేటర్లకు హెచ్టీ, ఎల్టీ కేటగిరీ కనెక్షన్లకు విద్యుత్ కనీస డిమాండ్ ఛార్జీలు రద్దు చేస్తామని ప్రకటించారు. రూ.10 కోట్ల లోపు బడ్జెట్తో నిర్మించే సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్మెంట్ సహాయం అందిస్తామని తెలిపారు.
సినిమాపై మీ ఇష్టం...
అన్ని సినిమా థియేటర్లలో షోలు పెంచేందుకు అనుమతిచ్చారు సీఎం కేసీఆర్. మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ తరహాలో టిక్కెట్ల ధరలు సవరించుకునే వెసులుబాటు కల్పించారు. థియేటర్లను ఎప్పుడైనా తెరుచుకోవచ్చు.. నిర్ణయాధికారం సినీ పరిశ్రమదే అని తెలిపారు.
మూసీలో బోటింగ్...
త్వరలోనే కేశవాపురం జలాశయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. రూ.13 వేల కోట్ల అంచనా వ్యయంతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక చేసినట్లు కేసీఆర్ వివరించారు. మూసీతో గోదావరి నీటిని అనుసంధానించి ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు. బాపుఘాట్ నుంచి నాగోల్ వరకు మూసీ నది మధ్యలో బోటింగ్ నిర్వహించేలా చేస్తామన్నారు.
మెట్రో రెండోదశ...
హైదరాబాద్ మెట్రో రెండో దశను విస్తరిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయం, బీహెచ్ఈఎల్ నుంచి మెహదీపట్నం వరకు మెట్రో రైలును విస్తరిస్తామని వెల్లడించారు. నగరంలోని ప్రధాన కేంద్రాల నుంచి విమానాశ్రయానికి ఎక్స్ప్రెస్ మెట్రో రైలు విస్తరించేలా పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఎంఎంటీఎస్ కూడా...
మరో 90 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్ రైళ్ల విస్తరణ చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు. మెట్రో రైలు విస్తరణకు అవకాశం లేని ప్రాంతాల్లో ఎలివేటెడ్ బీఆర్టీఎస్తో పాటు ప్రాంతీయ బాహ్యవలయ రహదారి (రీజినల్ రింగ్రోడ్)ను నిర్మిస్తామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేని నగరంగా ఫుట్పాత్లు, స్కైవాక్లు, సైకిల్ ట్రాక్ల నిర్మాణం చేపడతామని కేసీఆర్ వెల్లడించారు.