Bopparaju On Employees Protest: ప్రభుత్వం దృష్టికి 71 డిమాండ్లు తీసుకెళ్లామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. 13 లక్షల మంది డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఈ మేరకు ఉద్యోగ సంఘ నేతలతో కలిసి కడపలో మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు సానుకూల స్పందన రాలేదన్నారు. ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్న ఆయన.. 11వ పీఆర్సీ అమలు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఇస్తామంటూ 7 డీఏలు పెండింగ్లో ఉంచారన్నారు. వైకాపా ప్రభుత్వం రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ చెప్పారని గుర్తు చేశారు.
'ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కూడా పెండింగ్లో ఉంది. వైద్య ఖర్చుల రీయంబర్స్మెంట్ జరగడం లేదు. మా సమస్య వినే స్థితిలో ప్రభుత్వం లేదు. అందుకే రోడ్లపైకి వచ్చాం. రేపట్నుంచి ఉద్యమ కార్యాచరణ, ప్రతి ఉద్యోగి నల్ల బ్యాడ్జీ ధరించాలి. ఈ నెల 16న అన్ని కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టాలి. ప్రభుత్వం దిగిరాకుంటే రెండోదశలో ఉద్యమం తీవ్రతరం చేస్తాం. 2 ఐకాసలు ఇచ్చిన 71 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి'
- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ ఛైర్మన్