తెలంగాణ

telangana

By

Published : Feb 5, 2023, 6:50 AM IST

ETV Bharat / business

USలో 'భారత​' కంటి మందు కలకలం.. బ్యాక్టీరియా సోకి 55 మందికి అస్వస్థత

మందుల నాణ్యత విషయంలో భారతీయ ఔషధ కంపెనీలు అంతర్జాతీయంగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఇటీవలే గాంబియాలో దగ్గు మందు కారణంగా 66 మంది పిల్లలు చనిపోగా.. ఇప్పుడు అమెరికాలోని పలు ప్రాంతాల్లో భారత్​ సరఫరా చేసిన కంటి చుక్కల మందు వల్ల 55 మందికి బ్యాక్టీరియా సోకింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని వెంటనే తెలియజేయాలంటూ చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ సంస్థను ఫార్మాగ్జిల్‌ ఆదేశించింది.

eye
eye

భారతీయ ఔషధ కంపెనీలు మందుల నాణ్యత విషయంలో అంతర్జాతీయంగా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో ఆఫ్రికాలోని గాంబియాలో దగ్గు మందు కారణంగా 66 మంది పిల్లలు చనిపోగా.. ఆ మందు సరఫరా చేసిన మేడెన్‌ ఫార్మా ఇబ్బందుల్లో పడింది. మరియోన్‌ బయోటెక్‌ అనే కంపెనీకి చెందిన మందును ఉజ్బెకిస్తాన్‌లో వినియోగించి 18 మంది పిల్లలు ప్రాణాపాయానికి గురయ్యారు. తాజాగా చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ అనే సంస్థ, అమెరికా మార్కెట్‌కు 'కాంట్రాక్టు మ్యానుఫ్యాక్చరింగ్‌' పద్ధతిలో సరఫరా చేసిన కంటి చుక్కల మందు విషయంలో సమస్యలు ఎదుర్కొంటోంది.

ఇలా కనిపెట్టారు..
'ఎజ్రికేర్‌' అనే బ్రాండు పేరుతో ఈ సంస్థ కంటి చుక్కల మందును అమెరికా మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ మందు సీసాలో ‘సూడోమనాస్‌ ఏరుజినోసా’ అనే ఒక హానికారక బ్యాక్టీరియాను గుర్తించారు. ఈ బ్యాక్టీరియా మందులకు లొంగదు. దీనివల్ల యూఎస్‌లోని కాలిఫోర్నియా, కొలరాడో, కనెటికట్‌, ఫ్లోరిడా, న్యూజెర్సీ, న్యూయార్క్‌... తదితర ప్రాంతాల్లో 55 మందికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు సోకడమే కాకుండా, కొందరికి కంటి సమస్యలు ఎదురైనట్లు, ఒకరు చనిపోయినట్లు వెలుగులోకి రావడంతో పెద్ద కలకలం రేగింది.

దీనిపై యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) హెచ్చరించటంతో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) రంగంలోకి దిగి, ఈ మందును గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ నుంచి దిగుమతి చేయకుండా నిషేధించింది. ఈ పరిస్థితుల్లో అమెరికా మార్కెట్‌ నుంచి ఈ మందును వెనక్కి తీసుకోవాలని గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ నిర్ణయించింది. ఈ తాజా వ్యవహారం మనదేశంలో అటు ఫార్మా పరిశ్రమ వర్గాల్లో, ఇటు ఔషధ నియంత్రణ అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ), ఫార్మాగ్జిల్‌ (ఫార్మాసూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌) రంగంలోకి దిగాయి.

పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశం
ఇప్పటికే గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఫార్మాగ్జిల్‌ కోరింది. మీకున్న ఔషధ ఎగుమతుల లైసెన్సులు ఎన్ని? ఏ ఔషధాలకు అనుమతులు తీసుకున్నారు? సంబంధిత పూర్తి సమాచారాన్ని వెంటనే తెలియజేయాలంటూ ఆదేశించింది. అంతేగాక అమెరికా మార్కెట్‌కు సరఫరా చేసిన మందు విషయంలో ఎందుకు సమస్యలు తలెత్తాయనేది పరిశీలించి ఆ వివరాలు కూడా సత్వరం అందించాలని స్పష్టం చేసింది.

ఫార్మాగ్జిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఉదయ భాస్కర్‌ను దీనిపై సంప్రదించగా.. 'మన ఔషధ పరిశ్రమకు ఇది ఎంతో నష్టం కలిగించే వ్యవహారం. తగిన దిద్దుబాటు చర్యలు చేపట్టడం ద్వారా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోనున్నాం. యూఎస్‌ మార్కెట్‌ మనకు ఎంతో ముఖ్యం. మన ఔషధ ఎగుమతుల్లో మూడో వంతు యూఎస్‌ మార్కెట్‌కు వెళ్తున్నాయి. అందువల్ల ఇది మన ప్రతిష్ఠతో ముడిపడి ఉన్న అంశం' అని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా యూఎస్‌తో పాటు అంతర్జాతీయంగా భారతీయ ఔషధ పరిశ్రమ ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదించిన విషయాన్ని గుర్తుచేశారు. యూఎస్‌ వెలుపల యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి ఉన్న యూనిట్లు అత్యధికంగా మన దేశంలోనే ఉన్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details