కేంద్ర ప్రభుత్వం పరిధిలోని 12 చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు తగ్గించాలన్న నిర్ణయంపై 12 గంటలు కూడా గడవకుండానే ఆర్థిక శాఖ యూటర్న్ తీసుకుంది. 2020-2021 చివరి త్రైమాసికంలో ఉన్న వడ్డీ రేట్లనే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయాన్నే ఈ విషయాన్ని తెలిపారు.
వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ఆర్థిక శాఖ బుధవారం సాయంత్రమే ప్రకటించడం గమనార్హం.
సీతారామన్ చొరవ..
ఇలాంటి కీలక అంశాల్లో.. అది కూడా కేవలం 12 గంటల్లోనే కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోవడం ఇదే ప్రథమం. వడ్డీ రేట్ల తగ్గింపుపై వెనక్కి తగ్గినందున.. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో.. ఆర్థిక శాఖ పబ్లిసిటీ టీం కోసం ఎదురుచూడకుండా.. సీతారామన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు.
వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం ఇదీ..
2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేటును.. 6.4 శాతనికి, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (ఎస్సీఎస్ఎస్)కు వడ్డీ రేటు 6.5 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్రం బుధవారం సాయంత్రం ప్రకటించింది. మొత్తం 12 పథకాల్లో వడ్డీ రేట్లను భారీగా తగ్గించాలని నిర్ణయించింది.
యూటర్న్ అందుకేనా..?
ఒకవేళ వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయం అమలులోకి వచ్చి ఉంటే.. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడేది. ఎందుకంటే ఆయా పథకాల్లో ఎక్కువ మొత్తం పెట్టుబడులున్నది సామాన్యులకే. సామాన్యుల ఆదాయంపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమైన పథకాల వడ్డీ రేట్లు..
వడ్డీ రేట్ల కోతపై కేంద్రం వెనక్కి తగ్గిన నేపథ్యంలో 2020-21 క్యూ4 వడ్డీ రేట్లే.. 2021-22 మొదటి త్రైమాసికానికి వర్తించనున్నాయి.
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) - 7.1 శాతం
- సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (ఎస్సీఎస్ఎస్) - 7.4 శాతం
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) - 6.8 శాతం
- సుకన్యా సమృద్ధి పథకం (ఎస్ఎస్ఎస్) - 7.6 శాతం
- కిసాన్ వికాస్ పాత్ర (కేవీపీ) - 6.9 శాతం
- రికరింగ్ డిపాజిట్స్ (5 ఏళ్ల పరిమితి) -5.8 శాతం
- సేవింగ్ డిపాజిట్ - 4 శాతం
ఇదీ చదవండి:గ్యాస్ సిలిండర్ ధర రూ.10 తగ్గింపు