న్యూ డెవలప్మెంట్ బ్యాంక్(ఎన్డీబీ) ప్రపంచ స్థాయి సంస్థగా ఎదగాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. బ్రిక్స్ విలువలను పరిరక్షిస్తునే అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎన్డీబీ బోర్డు గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు నిర్మలా. ఇందులో బ్యాంక్ ఉపాధ్యక్షుడు, చీఫ్ రిస్క్ అఫీసర్గా అనిల్ కిషోరాను నియమించేందుకు ఆమోదం లభించింది.
ఈ సమావేశంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కు అధ్యక్షుడిగా సేవలందిస్తున్న భారతీయ బ్యాంకర్ కె.వి. కామత్పైనా నిర్మలా ప్రశంసల వర్షం కురిపించారు. 2014లో బ్రిక్స్ నేతలు నిర్దేశించిన స్థాయికి ఎన్డీబీను అతి త్వరగా తీసుకెళ్లారని కొనియాడారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో వేగంగా స్పందించి.. కోవిడ్-19 అత్యవసర రుణ సదుపాయాన్ని ప్రారంభించడం ఆయన సేవల్లో గుర్తుండిపోయే కార్యక్రమమని సీతారామన్ చెప్పుకొచ్చారు.