దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సమయంలో కరోనా విజృంభణ పిడుగుపాటులా పరిణమించింది. అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారం కావాలంటే ఇకపై పన్నెండు శాతం నుంచి పద్నాలుగు శాతం వార్షిక వృద్ధిరేటు నమోదు చేయాలి. కరోనా కల్లోలం వల్ల దేశాభివృద్ధి రేటు రెండు నుంచి మూడు శాతం సాధించడమూ కష్టమే. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో లాక్డౌన్ ఉన్నందువల్ల ప్రపంచ జీడీపీ ఖాయంగా 12 శాతానికి పైగా పతనం అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యమన్న నానుడిని అందరికీ గుర్తుచేస్తూ, అంటువ్యాధులు మనుషులతోపాటు ఆర్థిక వ్యవస్థలనూ బలహీనపరుస్తున్నాయి.
గతంలో ప్లేగు, సార్స్ వంటి అనేక రకాల మహమ్మారులు అంతర్జాతీయంగా అనేక దేశాలను ఆరోగ్యపరమైన సవాళ్లను విసిరాయి. వీటి ప్రభావం అప్పట్లో ఆర్థిక వ్యవస్థపై నామమాత్రంగానే ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) ఏప్రిల్ నాలుగున ప్రకటించిన ప్రపంచ మహమ్మారి అనిశ్చితి సూచీ సైతం గతంలో వచ్చిన మహమ్మారులతో పోలిస్తే కరోనా ప్రభావం దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఎక్కువగా ఉన్నట్లు స్పష్టీకరించింది. మార్చి 31నాటికి నమోదైన కరోనా రోగుల సంఖ్య, 2002-03లో వచ్చిన సార్స్ బాధితులకన్నా మూడురెట్లు ఎక్కువని, ఎబోలా కన్నా 20 రెట్లు అధికంగా ఉన్నట్లు ఐఎమ్ఎఫ్ తన నివేదికలో వివరించింది. 2008-09నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభంకన్నా పెద్దదిగా కరోనా ప్రభావం ఉంటుందని స్పష్టీకరించింది. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఆర్థికంగా వెనకబడిన దేశాలకు కనీసం రెండున్నర లక్షల కోట్ల డాలర్లు అవసరమని ఐఎమ్ఎఫ్ సహా ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది.
వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానితో మరొకటి పరస్పరం పెనవేసుకుపోయి గణనీయ స్థాయిలో ఏకీకరణ అయినట్లు కరోనా ప్రభావం తదనంతర పరిణామాలు సూచిస్తున్నాయి. ప్రపంచ ఏకీకరణ వల్ల సేవారంగం, పెట్టుబడులు, ఎక్సైజ్ రేటు, బ్యాంకింగ్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎగుమతులు దిగుమతుల ద్వారా ఆర్థికవ్యవస్థలపై ప్రభావాన్ని చూపిస్తాయి. దాదాపు 200 పైచిలుకు కరోనా ప్రభావిత దేశాలు ఉండగా- ప్రపంచ గిరాకీలో చైనా, అమెరికా, ఇటలీ, కొరియా, జపాన్, జర్మనీ దేశాలు వాటాలో 55 శాతం, తయారీ రంగంలో సుమారు 60 శాతం భాగస్వామ్యం కలిగిఉన్నాయి. కనుక ఈ దేశాల ఆర్థిక వ్యవస్థల ప్రభావం మిగతా ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడబోతోంది. దీన్ని ఎదుర్కోవడానికి వివిధ దేశాలు, వాటి కేంద్ర బ్యాంకులు, అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్న సహాయక చర్యలు, 2008-09 ఆర్థిక సంక్షోభ సమయంలో ప్రకటించిన వాటికన్నా భారీగా ఉన్నాయి. అయినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థలకు సూచీలైన స్టాక్ మార్కెట్లు అత్యంత కనిష్ఠ స్థాయికి చేరుకోవడం సమస్య తీవ్రతను తెలుపుతోంది.