రాష్ట్రంలోని బ్యాంకర్లు ఈ ఆర్థిక ఏడాది భారీ ఎత్తున రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇవాళ జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకర్లు వెల్లడించారు. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన 26వ త్రైమాసిక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా ఎస్ఎల్బీసీ కన్వీనర్ ఓం ప్రకాష్ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2019-20 ఆర్థిక ఏడాదికి చెంది రాష్ట్రంలోని బ్యాంకుల పనితీరు వివరాలను సమావేశంలో ఎస్ఎల్బీసీ కన్వీనర్ మిశ్ర వెల్లడించారు.
బ్యాంకు డిపాజిట్లు రూ.4.58 లక్షల కోట్లు
2019 మార్చి నాటికి రూ.4.54లక్షల కోట్లుగా ఉన్న బ్యాంకుల డిపాజిట్లు ఈ ఏడాది మార్చి చివరినాటికి రూ.30,168 కోట్లు పెరిగి రూ.4.84లక్షల కోట్లకు చేరినట్లు మిశ్ర వెల్లడించారు. గతేడాది మార్చి చివర నాటికి రూ.5.33లక్షల కోట్లుగా ఉన్న రుణాలు ఈ ఏడాది మార్చి చివర నాటికి రూ.5.70లక్షల కోట్లకు పెరిగినట్లు తెలిపారు. 2019-20 ఆర్థిక ఏడాదిలో ఖరీఫ్, రబీ సీజన్లలో ఇచ్చిన వ్యవసాయ రుణాలు రూ.37,109 కోట్లు, వ్యవసాయ టెర్మ్ రుణాల కింద వ్యవసాయ అనుబంధ పరికరాలు కొనుగోలు కోసం రూ.14,850 కోట్లు, విద్య రుణాలు రూ.977 కోట్లు, గృహ రుణాలు రూ.5,099 కోట్లు, ప్రాధాన్యత రంగాలకు రూ.1.11లక్షల కోట్లు రుణాలు ఇచ్చి 99.77శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు వివరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.49,848 కోట్లు రుణాలు ఇచ్చి నిర్దేశించిన లక్ష్యంలో 158శాతం పూర్తి చేసినట్లు వెల్లడించారు.
'ముద్ర' కింద రూ.6,960కోట్లు
1.74లక్షల మంది మైనార్టీలకు రూ.2,668కోట్లు, 26.73లక్షల మంది బలహీన వర్గాల లబ్ధిదారులకు రూ.21,860 కోట్లు, ఎస్టీ, ఎస్టీ కెటగిరీ లబ్ధిదారులకు రూ.5,071 కోట్లు రుణాలు ఇచ్చినట్లు వివరించారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన-పీఎంఎంవై కింద రూ.6,960 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా... రూ.9,128 కోట్లు రుణాలు ఇచ్చి 131శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. 2019-20 ఆర్థిక ఏడాదిలో రూ.1.46లక్షల కోట్లు రుణ లక్ష్యంగా పెట్టుకోగా ఈ ఆర్థిక ఏడాదిలో 10.52శాతం అధికంగా రూ.1.61లక్షల కోట్లు మొత్తం రుణాలు కింద ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఎస్ఎల్బీసీ కన్వీనర్ మిశ్ర వెల్లడించారు. ప్రాధాన్యత రంగానికి గత ఆర్థిక ఏడాదిలో రూ.1.11లక్షల కోట్లు రుణ లక్ష్యంకాగా ఈ ఆర్థిక ఏడాదిలో 10.27శాతం పెంచి రూ.1.22లక్షల కోట్లు మొత్తాన్ని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.