ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను జీవీకే గ్రూప్ నుంచి బదిలీ చేసుకున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ ఎయిర్పోర్టులో జీవీకే గ్రూప్కు ఉన్న 50.5శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు గతేడాది ఆగస్టులోనే అదానీ వెల్లడించింది. దీంతో పాటు మైనారిటీ భాగస్వాముల నుంచి 23.5 శాతం వాటాను దక్కించుకోనున్నట్లు తెలిపింది. మంగళవారం నిర్వహించిన బోర్డు మీటింగ్లో నిర్వహణ బాధ్యతలను స్వీకరించినట్లు అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ వెల్లడించింది. అంతకుముందు, సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయంపై ట్వీట్ చేశారు.
"ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను తీసుకోవడం సంతోషకరం. భవిష్యత్ ఎయిర్పోర్ట్ ఎకోసిస్టమ్ను రూపొందించేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నిస్తుంది. స్థానికంగా వేలాది కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాం. ముంబయి గర్వించేలా చేస్తామని హామీ ఇస్తున్నా."
-గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్