కరోనా సంక్షోభం కారణంగా 600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఉబర్ ఇండియా ప్రకటించింది. సంస్థ నష్టాల్లో ఉన్న కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ పేర్కొంది.
"కరోనా, లాక్డౌన్ల వల్ల సంస్థకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగింది. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మా ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సి వచ్చింది. ప్రస్తుతానికి డ్రైవర్లు, ఇతర ఉద్యోగులు సహా 600 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాం."
- ప్రదీప్ పరమేశ్వరన్, ఉబర్స్ ఇండియా అండ్ సౌత్ ఏషియా బిజినెస్ ప్రెసిడెంట్
విచారకరమే గానీ..
ఈ నెల మొదట్లో... ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలోని పలువురు ఉద్యోగులను తొలగించనున్నట్లు ఉబర్ ప్రకటించింది. అందులో భాగంగానే తాజాగా ఉద్యోగులను తొలగించినట్లు పరమేశ్వరన్ తెలిపారు.
"ఉబర్ కుటుంబం నుంచి కొంత మంది సహోద్యోగులు బయటకు వెళ్లడం చాలా విచారకరం. అయితే మేము భవిష్యత్తులో రాణిస్తామనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాం."
- ప్రదీప్ పరమేశ్వరన్, ఉబర్స్ ఇండియా అండ్ సౌత్ ఏషియా బిజినెస్ ప్రెసిడెంట్