హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైన సంస్థ ఇండియన్ ఇమ్యునలాజికల్స్ (ఐఐఎల్), కరోనా వైరస్ (కోవిడ్-19)నిరోధానికి వ్యాక్సిన్ తయారీ సన్నాహాల్లో నిమగ్నమైంది. దీని కోసం ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ విశ్వవిద్యాలయంతో పరిశోధనా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఐఐఎల్ శాస్త్రవేత్తలు, గ్రిఫిత్ పరిశోధకులు కలిసి సంయుక్తంగా ‘కోడాన్ డీ-ఆప్టిమైజేషన్ టెక్నాలజీ’ ద్వారా కరోనా వ్యాక్సిన్ స్ట్రెయిన్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తయారయ్యే వ్యాక్సిన్ ఎంతో భద్రమైనది కావడంతో పాటు ఒక్క డోసుతో సరిపోతుందని, కరోనా వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని ఐఐఎల్ ఇక్కడ ఒక ప్రకటనలో వెల్లడించింది.
దశలవారీ పరీక్షల అనంతరమే
రెండు సంస్థల సంయుక్త పరిశోధనలో వ్యాక్సిన్ స్ట్రెయిన్ సిద్ధం అయ్యాక, దాన్ని ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ (ఐఐఎల్) కు బదిలీ చేస్తారు. దీనిపై నిర్దేశిత ప్రమాణాల ప్రకారం దశల వారీగా ఔషధ పరీక్షలు (క్లినికల్ ట్రయల్స్), భద్రత పరీక్షలు (సేఫ్టీ ప్రొఫైల్) నిర్వహిస్తారు. అనంతరం పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ డోసుల తయారీకి ‘వీరో సెల్ ప్లాట్ఫామ్ టెక్నాలజీ’ ని వినియోగించాలని ఐఐఎల్ భావిస్తోంది.
తక్కువ ఖర్చులోనే చేయగలం
ప్రజారోగ్య అవసరాలకు ఐఐఎల్ కట్టుబడి ఉందని, అందులో భాగంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీకి నడుం కట్టినట్లు సంస్థ ఐఐఎల్ ఎండీ డాక్టర్ కె.ఆనంద కుమార్ వెల్లడించారు. అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాత వ్యాక్సిన్ తయారీకి ‘కోడాన్ డీ-ఆప్టిమైజేషన్ టెక్నాలజీ’ వినియోగించాలని నిర్ణయించినట్లు ఐఐఎల్ డిప్యూటీ ఎండీ డాక్టర్ ప్రసన్న దేశ్ పాండే తెలిపారు. ఎంతో నాణ్యమైన వ్యాక్సిన్ను తక్కువ ఖర్చులోనే తయారు చేయగలుగుతామనే ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారు. ఎంటరోవైరస్ సీ (పోలియో వైరస్), హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్ టైప్-1, జికా వైరస్ వంటి పలు రకాల ఆర్ఎన్ఏ వైరస్లను అదుపు చేయటానికి ‘కోడాన్ డీ-ఆప్టిమైజేషన్ టెక్నాలజీ’ సమర్థంగా పనిచేస్తుందని ఇప్పటికే నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు.