కరోనా వల్ల దాదాపు అని రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. అందులో కొన్ని ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా.. మరికొన్ని ఇంకా కోలుకోవాల్సి ఉంది. ఆతిథ్య రంగం కూడా ఇదే కోవలోకి వస్తుంది. కరోనా వల్ల ప్రయాణాలు తగ్గిపోవటం వంటి కారణాలతో ఆతిథ్య రంగం నెమ్మదిగా కోలుకుంటోంది.
కరోనా వల్ల నెలకొన్న పరిస్థితులతో.. దేశంలోని ఆతిథ్య రంగం 2020లో దాదాపు రూ.90,000 కోట్ల ఆదాయం నష్టపోవచ్చని హెచ్వీఎస్ ఆనరాక్ నివేదిక అంచనా వేసింది.
ఒక వేళ కరోనా వ్యాక్సిన్ 2021లో అందుబాటులోకి వచ్చి.. ఏడాది చివరి నాటికి పెద్ద ఎత్తున ప్రజలకు అందితే.. ఆతిథ్య రంగం ఆక్యుపెన్సీ, రోజువారీ సగటు రేటు(ఏడీఆర్) తిరిగి 2022, 2023 నాటికి కొవిడ్ సంక్షోభం ముందున్న స్థాయికి చేరుతాయని అంచనా వేసింది.
పెరుగుతున్న డిమాండ్..
చాలా రోజుల లాక్డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనంతరం దేశీయంగా ప్రయాణాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. దీని వల్ల హోటల్ వ్యాపారాల్లో ఇటీవల స్వల్ప రికవరీ కనిపిస్తోందని వెల్లడించింది నివేదిక.