కరోనా ధాటికి భారత ఆర్థిక వ్యవస్థ విలవిలలాడుతున్న నేపథ్యంలో... 13కోట్ల 60లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చని, 12కోట్ల మంది తిరిగి పేదరికంలోకి జారుకునే అవకాశముందని తాజాగా వెలువడిన ఓ నివేదిక పేర్కొంది. ప్రజల ఆదాయం, వ్యయం, పొదుపులపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది.
అంతర్జాతీయ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ... ఆర్థర్ డి లిటిల్... "ఇండియా: సర్మౌంటింగ్ ది ఎకనామిక్ ఛాలెంజెస్ పోస్డ్ బై కొవిడ్-19: ఎ 10-పాయింట్ ప్రోగ్రామ్ టు రివైవ్ అండ్ పవర్ ఇండియాస్ పోస్ట్-కొవిడ్ ఎకానమీ" పేరుతో ఓ నివేదిక వెలువరించింది.
నిరుద్యోగం, పేదరికం తప్పవ్...
నివేదిక ప్రకారం.. భారత్లో నిరుద్యోగం 7.6 శాతం నుంచి 35 శాతానికి పెరగవచ్చు. ఫలితంగా 13 కోట్ల 60 లక్షల ఉద్యోగాలు పోతాయి. దీనితో మొత్తంగా 17 కోట్ల 40 లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోతారు. 12 కోట్ల మంది పేదరికంలోకి, 4 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారు.
జీడీపీ క్షీణిస్తుంది...
కరోనా సృష్టించిన ఆర్థిక విపత్తు కారణంగా.. భారత్లో ఉద్యోగ నష్టం, పేదరికం పెరగడం, తలసరి ఆదాయం తగ్గడం జరుగుతుందని నివేదిక పేర్కొంది. ఫలితంగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) క్షీణిస్తుందని వివరించింది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో 10.8 శాతం ఉన్న జీడీపీ... 2021-22 నాటికి 0.8 శాతానికి మాత్రమే పరిమితం కావచ్చు. మొత్తానికి భారత్ 1 ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోవచ్చు."