దేశంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు పేర్కొంది. అక్కడ లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని.. మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణాలోనూ అలాంటి పరిస్థితే ఉందని తెలిపింది. ఆయా రాష్ట్రాల అధికారులతో ఇప్పటికే మూడుసార్లు సమావేశమైనట్లు వెల్లడించింది. 'మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే.. ప్రస్తుతం కరోనా కేసుల వృద్ధిలో మ్యూటెంట్లు కనిపించలేదు. కేసుల పెరుగుదలకు ప్రధానంగా టెస్టులు, కేసుల ట్రేసింగ్ తగ్గించటం, కొవిడ్ పట్ల ప్రజల నిర్లక్ష్యం, పెద్ద ఎత్తున సమావేశాలే కారణం' అని పేర్కొన్నారు ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ.
మహారాష్ట్ర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్నారు.
టీకాల కొరత లేదు..
దేశంలో మార్చి 11 వరకు 2.56 కోట్ల టీకా డోసులు అందించినట్లు తెలిపారు ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్. ప్రైవేటు వ్యవస్థల భాగస్వామ్యంతో టీకా పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసినట్లు వెల్లడించారు. 71 శాతం ప్రజా ఆరోగ్య కేంద్రాలు, 28.77 శాతం ప్రైవేటు కేంద్రాల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు.
తగ్గనున్న ధరలు..
టీకా ధరలపై పునఃపరిశీలన చేశామని, ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్ తయారీదారులతో చర్చలు జరిపిన తర్వాత.. ఈ ప్రకటన చేశారు భూషణ్. డోసుకు రూ. 200 లోపే లభిస్తుందని ఆయన అన్నారు.