తమిళనాడులో ఓ పక్క ఎన్నికల వాతావరణం వేడెక్కుతుండగా.. మరో పక్క ముఖ్యమంత్రి పదవికి పోటీ పడతారని అందరూ భావించిన శశికళ ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు. ఈమె మద్దతు ఎవరికో తెలియక అన్నాడీఎంకే శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. ఆన్నాడీఎంకే, ఏఎంఎంకే నేతలు ఎవరికివారు ఆమె మద్దతు తమకేనంటున్నా.. లోలోపల మాత్రం సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు. కర్ణాటక జైలు నుంచి విడుదలైన శశికళ రాజకీయ ప్రవేశంపై పెద్దఎత్తున చర్చలు సాగాయి. కానీ..అనూహ్యంగా 'డీఎంకే మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే మన ప్రధాన ధ్యేయం కావాలి. మళ్లీ అమ్మ పాలన వచ్చేందుకు కృషి చేయాలి. ఆమె ఆశయాలు నెరవేరాలి. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా' అని మార్చి 3న సంచలన ప్రకటన చేశారు. దాంతో ఆమె ప్రకటనను అన్నాడీఎంకే, టీటీవీ దినకరన్ పార్టీలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. ఇరుపార్టీల ఎన్నికల ప్రచారంలో మాత్రం శశికళ ప్రస్తావన రావడం లేదు.
ఇదీ చదవండి:తమిళ బరిలో తెలుగు వెలుగులు!