తెలంగాణ

telangana

'ప్రజల దృష్టిని మరల్చడానికే 'టీకా కొరత' వ్యాఖ్యలు'

By

Published : Apr 7, 2021, 8:29 PM IST

కరోనా టీకా కొరతపై మహారాష్ట్ర నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్​. కొన్ని రాష్ట్రాలు తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిల్లర రాజకీయాలు మాని.. వైద్య సదుపాయాలు మెరుగుపరచడంపై దృష్టి సారించాలని సూచించారు.

Harsh Vardhan
డాక్టర్ హర్షవర్ధన్​

కరోనా కట్టడిలో విఫలమైన కొన్ని రాష్ట్రాలు.. ప్రజల దృష్టిని మరల్చడానికి, వారిలో భయాందోళనలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్. మహారాష్ట్రలో కరోనా టీకాల కొరత ఉన్నట్లు కొందరు ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. అర్హులకు సరిగా టీకాలు వేయకుండా, అందరికీ వ్యాక్సిన్ అందించాలని డిమాండ్ చేస్తూ.. ప్రజల్లో భయాలను పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

"కొవిడ్​ టీకా కొరత ఉన్నట్లు మహారాష్ట్ర చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. కరోనా పరీక్షలను తగినంతగా నిర్వహించడం లేదు. రాష్ట్ర సర్కార్.. సంస్థాగత నిర్బంధాన్ని తప్పనిసరి చేయకుండా ప్రజలను ప్రమాదంలోకి నెడుతోంది. మొత్తం మీద సంక్షోభం నుంచి తప్పించుకుంటోంది."

- డాక్టర్​ హర్షవర్ధన్​, కేంద్ర ఆరోగ్య మంత్రి

చిల్లర రాజకీయాలు మాని..

ఛత్తీస్​గఢ్​లోని నాయకులు.. వ్యాక్సినేషన్​పై నిరంతరం వదంతులు వ్యాప్తి చేస్తూ ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నారని హర్షవర్ధన్ ఆరోపించారు. చిల్లర రాజకీయాలు మాని.. వైద్య మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలని సూచించారు. కరోనా కట్టడికి ఎటువంటి వ్యూహాలు లేకుండా రాపిడ్​ యాంటిజెన్​ టెస్ట్​లపై రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడటాన్ని తప్పు పట్టారు.

ఇదీ చూడండి:పని ప్రదేశాల్లో కరోనా టీకాలు- కేంద్రం నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details