తైక్వాండో.. భారతీయులకు పెద్దగా పరిచయంలేని కళ. అందరూ కుంగ్ ఫూ, కరాటేపైనే ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే.. ఓ వ్యక్తి మాత్రం తైక్వాండోలో పట్టు సాధించి.. ఈ కళను భారత్లోను చాలా మందికి పరిచయం చేయాలని ప్రతినభూనాడు. ఇందుకోసం ఎంతగానో శ్రమించి రికార్డులకు రారాజుగా మారాడు. అతడే తమిళనాడుకు చెందిన తైక్వాండో కోచ్ ఎన్ నారాయణ.
మధురైకి చెందిన ఈ తైక్వాండో కింగ్ ఏకంగా 24 గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కాలేజీ రోజుల నుంచే తైక్వాండోపై ఉన్న ఆసక్తి.. అతను ఈ రికార్డులు సొంతం చేసుకునేందుకు ముందడుగు వేసేలా చేశాయని నారాయణ చెప్పుకొచ్చాడు.
ఆరు నెలలపాటు కఠోరంగా శ్రమించి ఓ రికార్డును ఇటీవలే బ్రేక్ చేశాడు నారాయణ. అయితే గతంలో రెండు సార్లు ఈ రికార్డు కోసం ప్రయత్నించినా ఆశించిన ఫలితం రాలేదని.. మూడో ప్రయత్నంలో రికార్డు సొంతం చేసుకోవడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.
"గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించి ఈ కళను ప్రమోట్ చేయాలని ఆశించాను. 2016లో మొదటిసారిగా గిన్నిస్ రికార్డు సాధించాను. ఇప్పటివరకు 24 గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకోగాలిగాను. ఇటీవలే యాక్స్ కిక్ ద్వారా సిమెంటు ఇటుకలను పగలగొట్టి రికార్డు సృష్టించాను. ఒక నిమిషంలో 37 ఇటుకలు పగలగొట్టాను."
--ఎన్ నారాయణ, తైక్వాండో కోచ్.
గతేడాది.. కాళ్లకు 10 కేజీల బరువు ధరించి(యాంకిల్ వెయిట్) నిమిషంలో 138 కిక్స్ చేశాడు ఈ తైక్వాండో కోచ్. అయితే.. తన జీవితంలో ఇదే అత్యంత కఠినమైన రికార్డుగా తొలుత భావించాడు నారాయణ. కానీ.. ఇంతకన్నా కఠిమైన రికార్డును బ్రేక్ చేయడం లక్ష్యంగా పెట్టుకొని మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
కొవిడ్ సంక్షోభం సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు అండగా నిలిచారని, అందుకే తన రికార్డును మోదీకి అంకితం చేస్తున్నట్లు నారాయణ చెప్పాడు.