దేశంలో కరోనా టీకా పంపిణీలో మరో కీలక అధ్యాయానికి తెర లేవనుంది. 18 ఏళ్లు పైబడినవారికి ఇవాళ్టి నుంచి పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ అందనుంది. ఇప్పటికే తయారీదారులతో సమన్వయం చేసుకున్న రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని కేంద్రం వెల్లడించింది. టీకా పంపిణీ కార్యక్రమం మూడో దశ ఊపందుకునేందుకు సమయం పడుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ అందిస్తే తప్ప.. ఈ దశలో టీకా ఉచితం కాదని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు రాష్ట్రాలకు 15 కోట్ల కొవిడ్ టీకా డోసులను ఉచితంగా అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. 45 ఏళ్లు పైబడినవారికి, ప్రాధాన్య జాబితాలో ఉన్న వ్యక్తులకు టీకా పంపిణీ ఉచితంగానే కొనసాగుతుందని వివరణ ఇచ్చారు.
అనేక రాష్ట్రాలు దూరం
దేశవ్యాప్తంగా టీకా పంపిణీలో భాగంగా మే 1 నుంచి 18-45 ఏళ్ల మధ్య వయస్కులకు వ్యాక్సిన్ అందించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే కరోనా టీకాల కొరత కారణంగా పలు రాష్ట్రాలు ఈ తంతుకు దూరంగా ఉన్నాయి. గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు మాత్రమే మూడో దశ టీకా పంపిణీని నేటి నుంచి ప్రారంభిస్తామని ప్రకటించాయి. ఆయా రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఎక్కువ ఉన్న జిల్లాల్లోనే 18-45 ఏళ్ల మధ్య వయసు వారికి టీకాను అందించనున్నారు. అపోలో, మ్యాక్స్, ఫోర్టిస్ ఆసుపత్రులు మాత్రం 18 నుంచి 45 ఏళ్ల వారికి.. శనివారం నుంచి నిర్ణీత ధరకు టీకా వేస్తామని ప్రకటించాయి.
మహారాష్ట్ర
18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలన్న అంశంపై మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే స్పందించారు. తక్షణం 25 నుంచి 30 లక్షల వ్యాక్సిన్ వయల్స్ రాష్ట్రానికి రాకపోతే మూడో విడత వ్యాక్సినేషన్ నిర్వహించడం సాధ్యం కాదని చెప్పేశారు. "కరోనా మూడో విడత వ్యాప్తి కూడా పొంచి ఉంది. రాష్ట్రానికి 12 కోట్ల డోసులు అవసరముంది" అని ఆయన చెప్పుకొచ్చారు.
మరోవైపు, ముంబయి నగర కార్పొరేషన్ పరిధిలో వ్యాక్సినేషన్ కొనసాగనుంది. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య టీకా పంపిణీ ఉంటుందని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికే టీకా ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
కర్ణాటక
మూడో విడత వ్యాక్సినేషన్పై కర్ణాటకలోనూ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. శనివారం నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించడానికి అవసరమైనన్ని వయల్స్ రాష్ట్రంలో లేవని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు. 'కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కోటి డోసులను ఆర్డర్ చేశాం. అయితే వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు ఇంకా వాటిని అందించలేదు. అందువల్ల 18-44 మధ్య వాళ్లు వ్యాక్సిన్ కోసం ఆస్పత్రులకు వెళ్లొద్దు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కచ్చితంగా తెలియజేస్తాం' అని చెప్పారు.
దిల్లీ
దిల్లీలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం చెప్పినప్పటికీ దిల్లీలో అదే మాత్రం కార్యరూపం దాల్చే పరిస్థితులు కనిపించడం లేదు. వ్యాక్సిన్ కోసం కేంద్రాల ఎదుట ఎవరూ బారులు తీరవద్దని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్లు అందలేదని, దీని కోసం వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో మాట్లాడుతున్నామని చెప్పారు. త్వరలోనే టీకాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గోవా
రాష్ట్రంలో వ్యాక్సిన్ నిల్వలు లేవని, అందువల్ల మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక మూడో విడత వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామన్నారు. అదెప్పుడన్నది చెప్పలేమన్నారు.