సెల్ టవర్లను ధ్వంసం చేయొద్దంటూ పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చేసిన విజ్ఞప్తిని రైతులు పట్టించుకోవడం లేదు. ఒక్క రోజు వ్యవధిలో మరో 176 టవర్లపై దాడులు జరిపారు. దీంతో పంజాబ్లో శిథిలమైన టవర్ల సంఖ్య 1,411 కి పెరిగింది. ఇందులో జియోతో పాటు ఇతర సంస్థలకు చెందిన టవర్లున్నాయి, టెలికాం పరిశ్రమకు చెందిన సుదుపాయ కేంద్రాలు కూడా ధ్వంసమయ్యాయి.
రైతుల నుంచి ఆహార ధాన్యాలను ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీకి చెందిన సంస్థలు కొనుగోలు చేయవు. కానీ కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలు కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చుతాయనే ఉద్దేశంతో ఆయా సంస్థలనే లక్ష్యంగా చేసుకున్నారు రైతులు.
సెల్ టవర్లను ధ్వంసం చేసే సమయంలో రైతులను ఆపేందుకు యత్నించిన సైట్ మేనేజర్లపైనా దాడులు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
టీఏఐపీఏ అభ్యర్థన..
టెలికాం టవర్లపై దాడులను ఆపాలంటూ.. టవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్(టీఏఐపీఏ) ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ దాడుల వల్ల సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది.