ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడాను దిల్లీ పోలీసులు అరెస్టు చేయగా.. గంటల వ్యవధిలోనే సుప్రీంకోర్టులో ఆయనకు ఉపశమనం లభించింది. అరెస్టయిన కాసేపటికే ఆయనకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ప్రధాని మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయన్ను గురువారం ఉదయం హైడ్రామా నడుమ దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అసోం పోలీసుల అభ్యర్థన మేరకు దిల్లీ ఎయిర్పోర్టులోనే పవన్ ఖేడాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఈ వ్యవహారంపై సుప్రీంను ఆశ్రయించింది కాంగ్రెస్. ఈ విషయాన్ని అత్యవసరంగా స్వీకరించిన సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ పిఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం.. పవన్కు తాత్కాలిక ఊరట కలిగేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది. పవన్కు బెయిల్ వచ్చే మంగళవారం(ఫిబ్రవరి 28) వరకు అమల్లో ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ప్లీనరీ జరగకుండా ఉండేందుకే..: కాంగ్రెస్ నేతలు
ఈ నెల 24 నుంచి 26 వరకు ఛత్తీస్గఢ్లోని రాయ్పుర్లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సభకు హాజరయ్యేందుకే పలువురు పార్టీ సీనియర్ నేతలతో కలిసి గురువారం ఉదయం ఇండిగో విమానంలో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు పవన్ఖేడా. ఫ్లైట్ కొద్ది నిమిషాల్లో టేకాఫ్ అవుతుందనే సమయంలో విమాన సిబ్బంది ఖేడాను ఆయన లగేజీ విషయమై కిందకు దిగమని కోరారు. అలాగే మీ కోసం కొందరు పోలీసులు వచ్చారని వారు చెప్పడం వల్ల ఆయన విమానం దిగారు. ఆయనతో పాటు మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా ప్లేన్ దిగి కిందకు వచ్చారు. ఈ క్రమంలోనే దిల్లీ పోలీసులు పవన్ను అరెస్టు చేశారు.
పవన్ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పవన్ను విమానం దింపిన అరగంట తర్వాత దిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు వచ్చి పవన్ను అసోం పోలీసులకు అప్పగించాలని చెప్పారని.. ఎఫ్ఐఆర్, అరెస్ట్ వారెంట్ వంటి ఏమైనా పత్రాలు ఉన్నాయా అని మేము అడిగితే.. మౌఖిక ఆదేశాల మేరకే ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్నట్లుగా పోలీసులు తెలిపారని కాంగ్రెస్ పేర్కొంది.