తెలంగాణ

telangana

By

Published : Feb 23, 2023, 3:11 PM IST

Updated : Feb 23, 2023, 7:15 PM IST

ETV Bharat / bharat

విమానంలో హైడ్రామా మధ్య కాంగ్రెస్​ నేత అరెస్ట్.. కాసేపటికే బెయిల్

కాంగ్రెస్​ సీనియర్​ నేత పవన్​ ఖేడా అరెస్టుపై రాజకీయంగా దుమారం రేగింది. మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో దిల్లీ పోలీసులు ఆయన్ను విమానం నుంచి దించి మరీ అరెస్టు చేశారు. వెంటనే కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. పవన్​కు బెయిల్ లభించింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది.

Congress leader arrest in delhi airport
దిల్లీ విమానాశ్రయంలో కాంగ్రెస్​ నేత అరెస్టు

ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్​ సీనియర్​ నేత పవన్​ ఖేడాను దిల్లీ పోలీసులు అరెస్టు చేయగా.. గంటల వ్యవధిలోనే సుప్రీంకోర్టులో ఆయనకు ఉపశమనం లభించింది. అరెస్టయిన కాసేపటికే ఆయనకు మధ్యంతర బెయిల్​ను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ప్రధాని మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయన్ను గురువారం ఉదయం హైడ్రామా నడుమ దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అసోం పోలీసుల అభ్యర్థన మేరకు దిల్లీ ఎయిర్​పోర్టులోనే పవన్​ ఖేడాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఈ వ్యవహారంపై సుప్రీంను ఆశ్రయించింది కాంగ్రెస్​. ఈ విషయాన్ని అత్యవసరంగా స్వీకరించిన సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ డీవై చంద్రచూడ్​, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్​ పిఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం.. పవన్​కు తాత్కాలిక ఊరట కలిగేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది. పవన్​కు బెయిల్​ వచ్చే మంగళవారం(ఫిబ్రవరి 28) వరకు అమల్లో ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ప్లీనరీ జరగకుండా ఉండేందుకే..: కాంగ్రెస్​ నేతలు
ఈ నెల 24 నుంచి 26 వరకు ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​లో కాంగ్రెస్​ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సభకు హాజరయ్యేందుకే పలువురు పార్టీ సీనియర్​ నేతలతో కలిసి గురువారం ఉదయం ఇండిగో విమానంలో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు పవన్​ఖేడా. ఫ్లైట్​​ కొద్ది నిమిషాల్లో టేకాఫ్​ అవుతుందనే సమయంలో విమాన సిబ్బంది ఖేడాను ఆయన లగేజీ విషయమై కిందకు దిగమని కోరారు. అలాగే మీ కోసం కొందరు పోలీసులు వచ్చారని వారు చెప్పడం వల్ల ఆయన విమానం దిగారు. ఆయనతో పాటు మిగతా కాంగ్రెస్​ నాయకులు కూడా ప్లేన్​ దిగి కిందకు వచ్చారు. ఈ క్రమంలోనే దిల్లీ పోలీసులు పవన్​ను అరెస్టు చేశారు.

పవన్​ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పవన్​ను విమానం దింపిన అరగంట తర్వాత దిల్లీ పోలీస్​ ఉన్నతాధికారులు వచ్చి పవన్​ను అసోం పోలీసులకు అప్పగించాలని చెప్పారని.. ఎఫ్‌ఐఆర్, అరెస్ట్ వారెంట్ వంటి ఏమైనా పత్రాలు ఉన్నాయా అని మేము అడిగితే.. మౌఖిక ఆదేశాల మేరకే ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్నట్లుగా పోలీసులు తెలిపారని కాంగ్రెస్​ పేర్కొంది.

అనంతరం ఈయన అరెస్టుపై అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా కాంగ్రెస్​ నాయకులు సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఖేడాకు మధ్యంతర బెయిల్​ను మంజూరు చేసింది సుప్రీం ధర్మాసనం. ఖేడాపై వివిధ నగరాల్లో నమోదైన ఎఫ్​ఐఆర్​లకు సంబంధించి పూర్తి వివరాలు తమకు సమర్పించాలని సుప్రీం కోర్టు అసోం, ఉత్తప్​ప్రదేశ్​ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అలాగే పవన్​ పిటిషన్​పై స్పందించాలని సూచించింది.
పవన్​ ఖేడా వ్యవహారంలో కాంగ్రెస్ నేతల వైఖరిని బీజేపీ తప్పుబట్టింది. తాము చట్టానికి అతీతమనే భావన నుంచి ఆ పార్టీ నేతలు బయటకు రావాలని హితవు పలికింది.

ఏం వ్యాఖ్యలు చేశారు..?
ఫిబ్రవరి 17న ముంబయిలో నిర్వహించిన పార్టీ విలేకరుల సమావేశంలో మోదీని ఉద్దేశించి పవన్​ ఖేడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పేరును నరేంద్ర దామోదర్​ దాస్​ మోదీకి బదులు నరేంద్ర గౌతమ్​ దాస్​ మోదీ అని పలికారు. ఈ మాటలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. మోదీ తండ్రి పేరును అవమానించారంటూ పలువురు కమలనాథులు మండిపడ్డారు.

అసోంలోని దిమా హసావో జిల్లాలోని హఫ్లాంగ్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేత పవన్ ఖేడాపై ఓ బీజేపీ నేత ఫిర్యాదు చేశారు. అలాగే వారణాసి, లఖ్​నవూ నగరాల్లో కూడా ఈయనపై ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయి. ఇందులో ఆరోపణలు, పరువునష్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Last Updated : Feb 23, 2023, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details