2020 జనవరి 27.. భారత్లో తొలి కరోనా కేసు! అప్పటికి విదేశాల్లో కొవిడ్ వ్యాప్తి గురించి సమాచారమే తప్ప మహమ్మారి గురించి ఇక్కడి ప్రజలకు ప్రత్యక్ష అనుభవం లేదు. అప్పటి నుంచి రోజూ అడపాదడపా కేసులు వెలుగులోకి రావడం దేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. మార్చి 10 నాటికి 50, మార్చి 15 నాటికి 100... ఇలా కరోనా వ్యాప్తి యావద్దేశాన్ని భయాందోళనకు గురిచేసింది.
అప్పుడు వచ్చింది దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఓ ప్రకటన. మార్చి 22న దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని. కరోనా పోరులో తోటివారికి సంఘీభావంగా, వైరస్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సంకల్పంతో ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. మార్చి 22న(ఆదివారం) ప్రజలందరూ స్వయం ప్రకటిత కర్ఫ్యూలో పాల్గొనాలని కోరారు. ప్రధాని పిలుపుతో దేశ ప్రజలంతా ఏకమయ్యారు. సంకల్ప బలంతో 14 గంటల పాటు ఇంట్లోనే ఉండి జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు. ఈ సందర్భానికి నేటితో ఏడాది పూర్తవుతోంది. మరి ఇప్పుడు దేశ పరిస్థితి ఎలా ఉంది? ఈ ఏడాది కాలంలో వచ్చిన మార్పులేమైనా ఉన్నాయా? దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారా? అనే విషయాలను ఓ సారి పరిశీలిస్తే..
ఎత్తు పల్లాలన్నీ చూశాం
జనతా కర్ఫ్యూ పాటించినప్పటి నుంచి ఇప్పటి వరకు కరోనా మహమ్మారి విషయంలో దేశం ఎత్తుపల్లాలన్నింటినీ చూసింది. రోజువారీ కరోనా వైరస్ కేసులు పదులు, వందల నుంచి వేల స్థాయికి చేరుకున్నాయి. ఒకానొక దశలో 90 వేల చొప్పున కేసులు నమోదయ్యాయి. కానీ ఆ తర్వాత క్రమంగా కరోనా అదుపులోకి వచ్చింది. సగటున 10 వేల స్థాయికి రోజువారీ కేసులు పడిపోయాయి. కనిష్ఠంగా 8,635 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు, కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దశలవారీగా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. విజయవంతంగా పంపిణీ కొనసాగుతోంది.
అంతా సవ్యంగానే ఉందని అనుకుంటున్న ఈ సమయంలోనే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది. వైరస్ అదుపులోకి వచ్చిందన్న అపోహతో కనీస జాగ్రత్తలు గాలిలో కలిసిపోయాయి. ఈ పర్యవసనాలు రోజువారి కేసుల్లో స్పష్టంగా కనిపించింది. గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మార్చి 18 నుంచి నాలుగు రోజుల పాటు వరుసగా 35వేలు, 40 వేలు, 41 వేలు, 43 వేల కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మార్చి 22న 46,951 కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ వ్యాప్తి మొదలైందనే విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మళ్లీ అక్కడికే వచ్చామా?
గుర్తుందా...? జనతా కర్ఫ్యూ తర్వాతి రోజే దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది మూడు సార్లు పొడిగించారు. మే 31 వరకు చివరి దశ కొనసాగింది. జూన్ 1 నుంచి దేశం అన్లాక్ ఫేజ్లోకి అడుగుపెట్టింది.
ఇప్పుడు కేసుల పెరుగుదలతో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల బాట పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాయి. ప్రజలు బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. కరోనా ఉద్ధృతి మళ్లీ ప్రారంభమైందన్న ఆందోళనలు దేశప్రజల్లో మళ్లీ మొదలయ్యాయి. మొత్తానికి జనతా కర్ఫ్యూ నాటి రోజులను తలపించేలా దేశ పరిస్థితి ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. లాక్డౌన్ భయాలు అలుముకున్నాయి. కొవిడ్ కేసుల పెరుగుదల కొనసాగితే మరోసారి దేశవ్యాప్త లాక్డౌన్ ఉంటుందేమోనన్న చర్చలు ఊపందుకున్నాయి.
ఇవీ చదవండి:
- ఆ నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ!
- నాగ్పుర్లో లాక్డౌన్- వారికి పోలీసుల హెచ్చరిక
- కొవిడ్ సెకండ్ వేవ్: ఆంక్షల దిశగా రాష్ట్రాలు!
- కరోనా 2.0: నగరాల్లో వారాంతపు లాక్డౌన్
ఏం జరుగుతుంది?