Lakshadweep New Airport :మాల్దీవులు- భారత్ మధ్య పర్యటక ప్రదేశాలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. లక్షద్వీప్ను పర్యటకంగా అభివృద్ధి చేయాలని భారత్ యోచిస్తోంది. అందుకే లక్షద్వీప్లోని మినీకాయ్ దీవులలో కొత్త ఎయిర్ఫీల్డ్(వైమానిక కేంద్రం) నెలకొల్పాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఎయిర్ఫీల్డ్ను ఫైటర్ జెట్లు, సైనిక విమానాలు, వాణిజ్య విమానాలు కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి.
మినీకాయ్ దీవులలో ఈ కొత్త ఎయిర్ఫీల్డ్ను అభివృద్ధి చేయడానికి గతంలో కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే భారత్-మాల్దీవుల మధ్య పర్యటకంపై ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఎయిర్ఫీల్డ్ ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే దేశభద్రత విషయంలోనూ భారత్కు మినీకాయ్ దీవులు చాలా కీలకం. ఎందుకంటే మినీకాయ్ దీవులు అరేబియా సముద్రం, హిందూ మహాసముద్ర ప్రాంతానికి దగ్గర్లో ఉంటాయి.
కొన్నాళ్ల క్రితం మినీకాయ్ దీవుల్లో ఎయిర్ఫీల్డ్ను ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖను ఇండియన్ కోస్ట్గార్డు కోరింది. అక్కడి నుంచి తమ కార్యకలాపాలను నిర్వహించడానికి సిద్ధమని తెలిపింది. అయితే భారత్-మాల్దీవుల మధ్య తాజాగా చెలరేగిన నేపథ్యంలో ఇండియా లక్షద్వీప్లో ఎయిర్ఫీల్డ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక, మినీకాయ్లోని ఎయిర్ఫీల్డ్ను ఏర్పాటు చేయడం వల్ల రక్షణ దళాలు అరేబియా సముద్రంపై నిఘా పెట్టేందుకు ఉపయోగపడుతుంది. పర్యటకంగానూ లక్షద్వీప్ కూడా అభివృద్ధి చెందుతుంది.
'ప్రతి విషయాన్ని మోదీ వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు'
ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. 'నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మన పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలి. సమయానుకూలంగా వ్యవహరించాలి.' అని ఖర్గే అభిప్రాయపడ్డారు.
మోదీకి పవార్ మద్దతు
మాల్దీవులతో వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మద్దతుగా నిలిచారు. ఇతర దేశం ప్రధానిని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే అంగీకరించబోమని చెప్పారు. ప్రధాని పదవిని గౌరవించాలని ముంబయిలో మీడియా సమావేశంలో తెలిపారు. ఇతర దేశాలు ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించబోమని పేర్కొన్నారు.