ఆన్లైన్ గేమ్స్ మాయలో పడిన ఓ యువకుడు.. మతిస్తిమితం కోల్పోయి ఏకంగా సొంత బామ్మనే హతమార్చాడు. అంతటితో ఆగని నిందితుడు.. తాను దేవుడినని, ఆయనే తనతో ఈ పని చేయించాడని చెప్పాడు. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఎవరైనా అడ్డొస్తే వారికీ ఇదే గతిపడుతుందని హెచ్చరించాడు. కేరళలో ఈ దారుణ ఘటన జరిగింది.
మొబైల్ మాయలో..
కల్లాకురిచీ జిల్లాకు చెందిన మన్నాన్కట్టి కుమారుడు హరిహరన్ (21).. దిండిగల్ జిల్లా గాంధీనగర్లోని ఓ ప్రైవేట్ కాలేజ్లో బీఎస్సీ అగ్రికల్చర్(మూడో సంవత్సరం) చదువుతున్నాడు. లాక్డౌన్ కారణంగా కళాశాల మూతపడటం వల్ల.. ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నాడు హరిహరన్. ఈ క్రమంలోనే చరవాణికి అలవాటు పడిన అతడు.. రాత్రి, పగలూ తేడా లేకుండా ఆన్లైన్ గేమ్స్కు అంకితమైపోయాడు. తీవ్ర కుంగుబాటుకు లోనయ్యేవాడు. తల్లిదండ్రులు, సోదరి ఏదైనా చెబితే విసుక్కునేవాడు. కొడుకు ప్రవర్తనతో విసుగుచెందిన తండ్రి.. స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చూపించాడు. ప్రస్తుతం అతడి మానసిక స్థితి సరిగ్గాలేదని, చికిత్స అవసరమని డాక్టర్ సూచించాడు. కొంతకాలం చికిత్స పొందాక అతడు తిరిగి ఇంటికొచ్చాడు. ఇంట్లో ఉంటే తన కొడుకు ఇలాగే చికాకు పడుతూ ఉంటాడని భావించి.. అతణ్ని వేరే చోటుకు మార్చాలనుకున్నాడు.