కరోనా వైరస్తో మనకెన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. పిల్లల భవిష్యత్తుపై మాత్రం గట్టి దెబ్బే కొడుతోంది. ఏడాదిన్నర కాలంగా విద్యాసంస్థలు సరిగా నడవకపోవడం వల్ల వారు ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. తాత్కాలికంగా చదువుకు దూరమైన చిన్నారులను.. చురుగ్గా ఉంచేందుకు కేంద్ర విద్యాశాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇల్లే మొదటి పాఠశాలంటూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్రను గుర్తుచేసింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించింది.
'ఇల్లే మొదటి పాఠశాలని, తల్లిదండ్రులే మొదటి గురువులని నేను దృఢంగా భావిస్తాను. ఈ మహమ్మారి వేళ.. పిల్లల ఎదుగుదలలో, నేర్చుకోవడంలో వారిదే కీలక పాత్ర' అని విద్యాశాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ అన్నారు. అమ్మానాన్నలు పిల్లలకు ఏవిధంగా సహకరించగలరో మార్గదర్శకాల్లో విద్యాశాఖ వివరించింది. మూడు సంవత్సరాల వయస్సు నుంచి విద్యార్థి ప్రతిదశలో ఎదుగుదలకు దోహదం చేసే సమాచారాన్ని పొందుపరిచింది. అంతగా చదువుకోని తల్లిదండ్రులు, ప్రత్యేక అవసరాలున్న చిన్నారులు, ఒత్తిడిలో ఉన్న పిల్లలకోసం ప్రత్యేక వివరణ ఇచ్చింది. పది చాప్టర్లుగా విడుదల చేసిన మార్గదర్శకాలను విద్యాశాఖ వెబ్సైట్(www.education.gov.in)లో వీక్షించవచ్చు.