భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఓ గ్రామాన్ని నిర్మించినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో జాతీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. రాహుల్ విమర్శలను తిప్పికొడుతూ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు నడ్డా. ఈ క్రమంలో ఇరువురి మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది.
"చైనా విషయంలో దుష్ప్రచారం చేయటం కాంగ్రెస్ ఎప్పుడు మానుకుంటుందో చెప్పాలి. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే అరుణాచల్ ప్రదేశ్లోని వేల కిలోమీటర్ల ప్రాంతాలను చైనాకు కానుకగా ఇచ్చారన్న నిజాన్ని కాంగ్రెస్ ఒప్పుకోగలదా? కాంగ్రెస్ ఇంకా ఎన్ని సార్లు డ్రాగన్ దేశం ముందు లొంగిపోతుంది? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ఎందుకు పట్టించుకోలేదు? కనీస మద్దతు ధరను మీరు ఎందుకు పెంచలేదు? '
- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
రాహుల్.. విద్వేషభరిత ప్రసంగాలతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు నడ్డా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వారికి రైతులు గుర్తొస్తారని చురకలు అంటించారు. 'చైనాతో కాంగ్రెస్ పార్టీ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని రాహుల్ భావిస్తున్నారా? గాంధీ కుటుంబం నడుపుతున్న ట్రస్ట్లకు చైనా కానుకగా ఇచ్చిన ఆస్తులను తిరిగివ్వాలనుకుంటున్నారా?' అని ప్రశ్నించారు.
రాహుల్ ఎదురుదాడి..