దిల్లీ జామియా నగర్లో వారంలో మూడోసారి కాల్పులు దిల్లీ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం (జేఎంఐయూ)లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. గతవారం ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల ఘటన మరువకముందే మరో ఇద్దరు దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వర్సిటీ- అయిదో నంబర్ గేటు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదమూ జరగలేదని జామియా సహకార సంఘం (జేసీసీ) తెలిపింది.
ఎరుపు స్కూటీ, ఎర్రని కోటు...
ఆ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు.. ఎరుపు రంగు స్కూటీపై వచ్చినట్లు జేసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అందులో ఎర్రని కోటు ధరించిన వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలిపారు. దుండగుల స్కూటీ నెంబర్ 1532 లేదా 1534గా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ ఘటన ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో జరిగిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓఖ్లా నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యుడు అసీమ్ మహ్మద్ ఖాన్ తెలిపారు. ఈ ఘటనతో కలపుకొని వారం వ్యవధిలో జామియా నగర్లో మూడుసార్లు కాల్పులు జరిగాయి. హింసాత్మక ఘటనలు పునరావృతమవుతున్నా పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ... వందల సంఖ్యలో విద్యార్థులు స్థానిక ఠాణా ఎదుట ధర్నా చేశారు.
కాల్పుల అనంతరం ఘటనా స్థలికి చేరుకున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)... ఘటనపై దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండి: ఔరా! ఆమె చేతులు అద్భుతాన్ని చేశాయి