సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా తీవ్ర ఆరోపణలు చేసింది. పంజాబీ నటుడు దీప్ సిధు లాంటి అసాంఘిక శక్తులే ర్యాలీలో అల్లర్లు సృష్టించాయని పేర్కొంది. విద్రోహ శక్తులకు తమ ఉద్యమంలో స్థానం లేదని స్పష్టం చేసింది. ఈ ఘటన తరువాత.. తదుపరి కార్యచరణపై ప్రణాళికలు రూపొందించేందుకు బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. సంయుక్త కిసాన్ మోర్చా 41 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది.
" రెండు నెలలుగా శాంతియుతంగా కొనసాగుతున్న రైతు ఉద్యమంతో కేంద్రంలో కదలికలు తీసుకొచ్చాం. కానీ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఉద్యమానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అల్లర్లు సృష్టిస్తోంది. ఉద్యమం మొదలైన 15 రోజుల నుంచే కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ సొంతంగా నిరసనలు చేపడుతోంది. వాళ్లు మా ఉద్యమంలో భాగస్వామ్యం కాదు."