దేశవ్యాప్తంగా వలస కార్మికుల తరలింపుపై రాజకీయ దుమారం రేగింది. వలస కూలీల నుంచి రైలు ప్రయాణ ఖర్చులు వసూలు చేయడంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఆ ఛార్జీలను కూలీలు చెల్లించనవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని భాజపా స్పష్టంచేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని సూచించింది.
'వసూలు చేస్తూ విరాళాలిస్తారా?'
కరోనా సంక్షోభంలో రైలు ప్రయాణం కోసం భారతీయ రైల్వే.. వలస కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తూనే.. మరోవైపు పీఎం సహాయ నిధికి భారతీయ రైల్వే విరాళాలు ఇస్తోందని విమర్శించారు.
"ఓవైపు వలస కార్మికుల నుంచి టికెట్ ఛార్జీలు వసూలు చేస్తూనే.. మరోవైపు పీఎం సహాయ నిధికి రైల్వేశాఖ రూ.151కోట్లను విరాళంగా అందిస్తోంది. ఈ పజిల్ను మీరే పరిష్కరించండి."
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
వలస కూలీల రైలు ఖర్చులను కాంగ్రెస్ భరిస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించిన కొద్ది గంటల అనంతరం రాహుల్ ఈ ట్వీట్ చేశారు.
'మీరు ఇలాగే చేయండి...'
వలస కార్మికుల కోసం ఛార్జీల్లోని 85శాతాన్ని భారతీయ రైల్వే రాయితీగా అందిస్తోందని భాజపా పేర్కొంది. రైల్వే తీరును రాహుల్ గాంధీ ప్రశ్నించిన నేపథ్యంలో భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఈ మేరకు వ్యాఖ్యానించారు. మిగిలిన 15శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని తెలిపారు.
వలస కూలీలకు రైలు టికెట్లను రాష్ట్ర ప్రభుత్వాలే కొనిపెట్టవచ్చని సంబిత్ పాత్రా సూచించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇలాగే చేస్తోందని.. దీనిని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అనుసరించాలని పేర్కొన్నారు.
"రాహుల్ జీ... ఏ స్టేషన్లోనూ ఒక్క టికెట్ కూడా అమ్మకూడదని కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. 85శాతం రైల్వే రాయితీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు 15శాతం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వాలే వలస కూలీలకు టికెట్లు కొనుగోలు చేయవచ్చు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అదే చేస్తోంది. ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పాలిత ప్రాంతాలను అనుసరించమని చెప్పండి."
--- సంబిత్ పాత్రా, భాజపా అధికార ప్రతినిధి.
'టికెట్లు అమ్మట్లేదు..'
ఈ వ్యవహారంపై రైల్వేశాఖ స్పష్టతనిచ్చింది. టికెట్ రేటులోని 15శాతం మాత్రమే వసూలు చేస్తున్నట్టు పేర్కొంది. వలస కార్మికులకు టికెట్లు అమ్మడం లేదని.. ప్రభుత్వం అందిస్తున్న జాబితా ప్రకారమే వారిని రైళ్లలోకి ఎక్కించుకుంటున్నట్టు వెల్లడించింది.
సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ శ్రామిక్ రైళ్లను నడుపుతున్నట్టు భారతీయ రైల్వే స్పష్టం చేసింది. రైలులో ప్రయాణిస్తున్న వారందరికీ తాగు నీరు, భోజనం ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది. గమ్యస్థానాల నుంచి వెనక్కి వచ్చేడప్పుడు రైళ్లు ఖాళీగానే వస్తున్నాయని చెప్పింది.
ఇదీ చూడండి:-కరోనా భయాలు బేఖాతరు- మద్యం కోసం ఎగబడ్డ జనం