ప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్తో ఆన్లైన్లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య 7 కీలక ఒప్పందాలు కుదిరాయి. రక్షణ వాణిజ్యం, ఆరోగ్య రంగాల్లో సంబంధాల బలోపేతంపై సమీక్షించారు. భారత్, ఆస్ట్రేలియాలు పరస్పర సహకారంతో ఎదుగుతాయని ఆకాంక్షించారు మోదీ. సంక్షోభ సమయాన్ని అవకాశంగా మలచుకుందామని పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాతో భారత్కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని మరింత దృఢం చేసుకోవాలన్నారు. ఇరు ప్రాంతాలకే కాక, ప్రపంచ స్థిరత్వానికీ రెండు దేశాల సంబంధాలు కీలకం కావాలన్నారు భారత ప్రధాని.
ఆస్ట్రేలియాతో సంబంధాలను విస్తృతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉన్నట్లు చెప్పారు మోదీ. ఇది ఇండో పసిపిక్, ప్రపంచానికి చాలా కీలకమన్నారు. రెండు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని, కొవిడ్ సంక్షోభ కారణంగా తలెత్తిన ఆర్థిక, సామాజిక దుష్ప్రభావాల నుంచి బయట పడేందుకు ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కలిసి పనిచేద్దాం..
ఇండో ఫసిపిక్ రీజియన్లో పరస్పరం కలిసి పనిచేద్దామని మోదీకి సూచించారు మోరిసన్. ఇరుదేశాల మధ్య శాస్త్ర, సాంకేతిక ఒప్పందాలు సంతోషదాయకమన్నారు. ఈ సమావేశంతో రెండు దేశాల మద్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆకాంక్షించారు.
ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ ఈ ఏడాది జనవరిలోనే భారత్ పర్యటనకు రావాల్సి ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియాలో ఏర్పడ్డ భారీ కార్చిచ్చు కారణంగా అది మే నెలకు వాయిదా పడింది. అనంతరం కరోనా వైరస్ ప్రభావంతో తాజాగా ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి భారత్లో పర్యటించాలని మోరిసన్ను.. నరేంద్ర మోదీ కోరారు.