అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై సుప్రీం కోర్టు శనివారం చారిత్రక తీర్పు వెలువరించింది. అయితే.. తీర్పు వెలువరించటంపై పాకిస్థాన్ తన అక్కసును వెళ్లగక్కింది. కర్తార్పుర్ నడవా ప్రారంభం రోజున అయోధ్య కేసు తీర్పు వెలువరించిన పట్ల పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ అసహనం వ్యక్తం చేశారు. సిక్కు సమాజానికి పాక్ చేసిన సహాయాన్ని కప్పిపుచ్చడానికే చేశారని ఆరోపించారు.
'తీర్పు ఎందుకు ఈ రోజు వెలువడింది. ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగిన సమయం. సిక్కు సమాజానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన చారిత్రక సహాయ ప్రాముఖ్యాన్ని తగ్గించారు. ఎంతో సంతోషకర సమయంలో ఇలాంటిది జరిగినందుకు బాధగా ఉంది. అయోధ్య తీర్పు ద్వారా న్యాయాన్ని నిలబెట్టడంలో భారత సుప్రీంకోర్టు విఫలమైంది.'-షా మహ్మద్ ఖురేషీ, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి.
పాక్వి అసమంజస వ్యాఖ్యలు: భారత్
పాకిస్థాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. పాక్ వ్యాఖ్యలు వారి మానసిక రుగ్మతను తెలియజేస్తున్నాయని తిప్పికొట్టింది. భారత పౌరులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో పాకిస్థాన్ అసంమంజసమైన, అర్థరహితమైన వ్యాఖ్యలు చేసిందని... ఇది పూర్తిగా భారత అంతర్గత విషయమని స్పష్టం చేశారు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్.