మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన, భాజపా పట్టువీడట్లేదు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీతో సమావేశమైన భాజపా నేతలు...భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతున్నందున చట్టపరమైన అంశాలపై గవర్నర్తో చర్చించినట్లు వెల్లడించారు. మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, సీనియర్ నాయకుడు సుధీర్ ముంగంటివార్ గవర్నర్ను కలిసిన ప్రతినిధుల బృందంలో ఉన్నారు.
ఠాక్రేదే అంతిమ నిర్ణయం
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని శివసేన ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు అప్పగించారు. అధికారంలో సమాన వాటా ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
భాజపాతో పొత్తు తెంచుకోవాలని తాను భావించడం లేదని..లోక్సభ ఎన్నికలకు ముందు ఇరుపార్టీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఈ సమావేశం అనంతరం శివసేన ఎమ్మెల్యేలను ముంబయిలోని ఒక హోటల్కు తరలించినట్లు సమాచారం.