ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ను క్షణాల్లో నిర్ధరించే నూతన సాంకేతిక పరిజ్ఞానం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ర్యాపిడ్ టెస్టుల ద్వారా కొన్ని నిమిషాల వ్యవధిలోనే గుర్తించగలుగుతున్నారు. అయితే, తాజాగా అభివృద్ధి చేసిన సాంకేతికతతో కేవలం నిమిషంలోపే వైరస్ను నిర్ధరించవచ్చని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. భారత్-ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా కలిసి రూపొందించిన ఈ నూతన విధానం ప్రయోగాల్లో తుది దశకు చేరుకుంది. ఈ ర్యాపిడ్ టెస్ట్ విధానం సఫలీకృతమై మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానుందని ఇజ్రాయిల్ విదేశాంగశాఖ ప్రకటించింది.
'సంయుక్తంగా'
'కరోనా వైరస్ను అత్యంత వేగంగా గుర్తించేందుకు ఇప్పటికే భారత్-ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు కలిసి పరిశోధన జరిపారు. బ్రీత్ అనలైజర్తో పాటు వాయిస్ టెస్ట్ వంటి నాలుగు విభిన్న పరిజ్ఞానాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీటి ద్వారా వేల శాంపిళ్లను పరీక్షించి ఫలితాలను విశ్లేషించారు. ఇందులో కచ్చితంగా ఫలితమిచ్చే ఓ విధానం రానున్న రెండు, మూడు వారాల్లోనే ఖరారు కానుంది' అని ఇజ్రాయిల్ రాయబారి రాన్ మాల్కా వెల్లడించారు. వీటితోపాటు లాలాజలంలో కరోనా వైరస్ను గుర్తించే ఐసోథర్మల్ టెస్టింగ్పై కూడా పరిశోధన జరిపామన్నారు. ఇప్పటికే తుది దశ ప్రయోగాల్లో అన్ని విభాగాల్లో విజయవంతమైనందున త్వరలోనే అందుబాటులోకి వస్తుందని రాన్ మాల్కా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ నూతన విధానం కొవిడ్ టెస్టుల్లోనే గేమ్ ఛేంజర్గా మారే అవకాశం ఉందన్నారు.
30-40 సెకన్లలోనే