కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి పుణ్యక్షేత్రం భక్తజనసంద్రమైంది. సోమవారం ఉదయం నుంచే క్యూలైన్లలో భక్తుల పడిగాపులు ప్రారంభమయ్యాయి. నవంబర్ 16 నుంచి ఇప్పటివరకు 70 వేలమంది భక్తులు.. పుణ్యక్షేత్రాన్ని సందర్శించారని తెలుస్తోంది. రెండు నెలల పాటు జరిగే మండల మక్కర్విలక్కు పూజ అని పిలిచే.. మకర జ్యోతి సందర్శన వరకు ఈ పుణ్యక్షేత్రం తెరిచే ఉంటుంది.
రద్దీ ఎక్కువ అయిన కారణంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలు సరిపోలేదు. ఈ విషయంపై అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు.
ఆంక్షలు లేని దర్శనం..
మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ 2018 సెప్టెంబర్ 28 నాటి తీర్పును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపిన నేపథ్యంలో గతేడాది.. తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో నాడు పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ఆంక్షలు లేని కారణంగా భక్తులు ఆనందంగా దర్శనం చేసుకుంటున్నారు.
వాస్తవ పరిస్థితుల్లో పాత విధానమే..
గతేడాది శబరిమలను దర్శించిన కొంతమంది మహిళలకు రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించారు. అయితే ఈ ఏడాది శబరిమలకు వెళ్లాలనుకునే మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించబోమని తేల్చిచెప్పారు. వాస్తవ పరిస్థితిలో గమనిస్తే 2018 సెప్టెంబర్ 28 నాటి తీర్పుపై డీ ఫ్యాక్టో స్టే ఉందని వ్యాఖ్యానించారు కేరళ న్యాయశాఖమంత్రి ఏకే బాలన్. అయితే తాము సుప్రీం తీర్పునకు అనుగుణంగానే పనిచేయవలసి ఉంటుందన్నారు.
ఇదీ చూడండి: లాడెన్ మృతికి గుండెపోటే కారణమా..?