అన్నాడీఎంకే సీనియర్ నేత, తమిళనాడు మాజీ మంత్రి పి. పొన్నయన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. గత నెల 12న తమిళనాడు రాజధాని చెన్నైలో ఫ్లెక్సీ పడి 23ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందడానికి గాలి కారణన్నారు పొన్నయన్. అన్నాడీఎంకే నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కారణంగా ప్రమాదం జరగలేదని, గాలి వల్లే అలా అయిందని అన్నారు పొన్నయన్. అందుకే గాలిపైనే కేసు నమోదు చేయాలని సూచించారు.
"కుటుంబ సభ్యుల పెళ్లి వేడుకలో భాగంగా జయగోపాల్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆయన కావాలని ఫ్లెక్సీని శుభశ్రీ మీదకు విసరలేదు. జయగోపాల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరికాదు. గాలి వల్లే ఆ ఫ్లెక్సీ పడిపోయింది. కాబట్టి గాలిపైనే కేసు పెట్టాలి."
-పొన్నయన్, తమిళనాడు మాజీ మంత్రి.
పొన్నయన్ వాఖ్యలను ప్రతిపక్షాలు, సామజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు అన్నాడీఎంకే నేతల మొరటుతనానికి నిదర్శనమని డీఎంకే అధికార ప్రతినిధి విమర్శించారు.