2014లో ప్రారంభించిన ప్రగతి యజ్ఞాన్ని కొనసాగిస్తామన్న భరోసా కల్పిస్తూ ఎన్నికల మేనిఫెస్టో ఆవిష్కరించింది భాజపా. 2022 నాటికి నవ భారతం నిర్మించాలన్న కలను సాకారం చేసుకునేందుకు అనుసరించనున్న ప్రణాళికతో 45 పేజీల విజయ సంకల్ప పత్రం విడుదల చేసింది.
నవభారతం, సంక్షేమంతోపాటు రామ మందిర నిర్మాణం అంశానికీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది భాజపా. త్వరితగతిన మందిర నిర్మాణం చేపట్టేందుకు ఉన్న ప్రత్యామ్నాయాలన్నీ పరిశీలిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.
దిల్లీలో భాజపా ప్రధాన కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ మేనిఫెస్టో విడుదల చేశారు. పార్టీ అధ్యక్షుడు అమిత్షా, కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రజల మేనిఫెస్టో!
దేశంలోని 6 కోట్ల మంది ప్రజల అభిప్రాయాల్ని వేర్వేరు మార్గాల్లో తెలుసుకుని మేనిఫెస్టో రూపొందించినట్లు చెప్పారు కమలనాథులు. సంకల్ప్ పత్రాన్ని 'ప్రజల మనసులో మాట'గా అభివర్ణించారు.
భారత్@75 కోసం 75 లక్ష్యాలు...
ఐదేళ్ల మోదీ పాలనలో భారత్ సాధించిన విజయాల్ని మేనిఫెస్టోలో ప్రస్తావించింది భాజపా. అదే జోరును కొనసాగిస్తామని భరోసా ఇస్తూ మరికొన్ని కీలక హామీలు ఇచ్చింది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి ప్రతి భారతీయుడి జీవితంలో సకారాత్మక మార్పు తెచ్చే లక్ష్యంతో 75 హామీలు ఇచ్చింది భాజపా.
భాజపా హామీల్లో కీలకమైనవి కొన్ని....
దేశ భద్రత
* ఉగ్రవాదంపై ఉక్కుపాదం, సాయుధ దళాలు, రక్షణ రంగం బలోపేతం
* అసోంలో తీసుకొచ్చిన జాతీయ పౌర రిజిస్టర్-ఎన్ఆర్సీ క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ అమలు
* జమ్ముకశ్మీర్లో శాంతి భద్రతల పునరుద్ధరణకు చర్యలు- ఆర్టికల్ 370 రద్దు
రైతులు...
* 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు
* ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన లబ్ధి మరింత మంది రైతులకు చేరేలా చర్యలు
* 60ఏళ్ల వయసుపైబడ్డ చిన్న, సన్నకారు రైతులకు పింఛను
* గ్రామీణ-వ్యవసాయ రంగంలో రూ.25లక్షల కోట్ల పెట్టుబడులు
గ్రామ స్వరాజ్యం...
* గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం కృషి
* 2022 నాటికి ప్రతి కుటుంబానికీ సొంతిల్లు, తాగునీరు, డిజిటల్ అనుసంధానత, రహదారి అనుసంధానత.
ఆర్థికం....
* భారత్ను ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దడమే లక్ష్యం
* ఆర్థిక వ్యవస్థ విలువను 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్లు, 2032 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యం
* నిజాయితీగా పన్ను చెల్లించే వారిని ప్రోత్సహించేలా పన్ను రేట్లు తగ్గింపు.
* జీఎస్టీని మరింత సులభతరం చేసేందుకు చర్యలు
* 2024 నాటికి మౌలిక వసతుల రంగంలో రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు