తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంలో రోజుకు సగటున 80 హత్యలు, 91 రేప్​లు' - ఎన్​సీఆర్​బీ నివేదిక 2108

నిర్భయ హత్య కేసులో దోషులకు ఉరి శిక్ష పడడం వల్ల... న్యాయం జరిగిందని అంతా అనుకుంటున్నప్పటికీ, 2018లో అత్యాచార కేసుల్లో శిక్షా రేటు కేవలం 27.2 శాతంగా నమోదైంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్​ క్రైమ్​ రికార్డు బ్యూరో-ఎన్​సీఆర్​బీ.. 2018 ఏడాదికి గాను నేరాల గణాంకాలను విడుదల చేసింది.

Average 80 murders, 91 rapes daily in 2018: NCRB data
'దేశంలో రోజుకు సగటున 80 హత్యలు, 91 రేప్​లు'

By

Published : Jan 9, 2020, 5:39 PM IST

దేశంలో రోజుకు సగటున 80 హత్యలు, 289 కిడ్నాప్​లు, 91 అత్యాచారాలు నమోదవుతున్నాయని నేషనల్​ క్రైమ్​ రికార్డు బ్యూరో-ఎన్​సీఆర్​బీ తెలిపింది. 2018 ఏడాదికి గానూ నేర గణాంకాలను విడుదల చేసింది ఎన్​సీఆర్​బీ. 2017తో పోలిస్తే 2018లో నేరాల సంఖ్య 1.3 శాతం పెరిగిందని తెలిపింది. అయితే 2017 కన్నా 2018లో నేర సాంద్రత తగ్గిందని వివరించింది.

2018లో మొత్తం... 50,74,634 నేరాలు నమోదయ్యాయని చెప్పింది ఎన్​సీఆర్​బీ. ఇందులో భారత శిక్షాస్మృతి ప్రకారం 31,32,954 కేసులు, ప్రత్యేక, స్థానిక చట్టాల ప్రకారం 19,41,680 కేసులు ఉన్నాయి.

హత్యలు, కిడ్నాప్​లు...

2018లో మొత్తం 29,017 హత్య కేసులు నమోదయ్యాయి. హత్య కేసులకు గొడవలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీని తర్వాత వ్యక్తిగత కక్షలు, శతృత్వం వల్ల ఎక్కువగా హత్యలు జరిగాయి. 2017తో పోలిస్తే 2018లో కిడ్నాప్​ కేసులు 10.3 శాతం పెరిగాయి. 2018లో మొత్తంగా 1,05,734 అపహరణ కేసులు నమోదయ్యాయి. కిడ్నాపైన వారిలో అత్యధికంగా ఆడవారే ఉన్నారు. మొత్తం 24,665 మంది మగవారు కిడ్నాప్​ కాగా... 80,871 మంది ఆడవాళ్లు అపహరణకు గురయ్యారు. ఇందులో 92,137 మంది ఆచూకీ లభించింది. ఆచూకీ లభించిన వారిలో 91,709 మందిని ప్రాణాలతో పట్టుకోగలిగారు. 428 మంది చనిపోయిన తర్వాత ఆచూకీ లభ్యమైంది.

మహిళలపై నేరాలు పెరిగాయి...

నేషనల్​ క్రైమ్​ రికార్డు బ్యూరో గణాంకాల ప్రకారం... 2017తో పోలిస్తే 2018లో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య అధికంగా ఉంది. 2017లో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 3,59,849 కాగా.... 2018లో 3,78,277 నేరాలు జరిగాయి. ఇందులో 33,356 అత్యాచార కేసులున్నాయి. అత్యాచార కేసులు కూడా 2017తో పోలిస్తే పెరిగినట్లు ఎన్​సీఆర్​బీ వెల్లడించింది.

శిక్షల శాతం తక్కువే...

అత్యాచార కేసుల్లో శిక్షల శాతం 27.2 మాత్రమే. 2018లో 1,56,327 రేప్​ కేసులు విచారణకు రాగా... అందులో 17,313 కేసుల విచారణ మాత్రమే పూర్తైంది. అందులోనూ 4,708 కేసుల్లో మాత్రమే నిందితులు దోషులుగా తేలారు. ఇంకా 1,38,642 కేసులు... 2018లో పెండింగ్​లో ఉన్నాయని ఎన్​సీఆర్​బీ గుర్తించింది.

నిర్భయ హత్యాచర ఘటన జరిగిన తర్వాత, చట్టాలు కఠినంగా మారినప్పటికీ, శిక్షారేటు తక్కువగా నమోదవుతోంది. ఈ తరహా కేసుల్లో వేగవంతమైన విచారణ జరగాలని మహిళా హక్కుల కార్యకర్తలు డిమాండ్​ చేస్తున్నారు. శిక్షా రేటు తక్కువగా నమోదు కావడానికి పరిష్కారం... ఫాస్ట్​ట్రాక్​ కోర్టులను పెంచడమేనని అభిప్రాయపడుతున్నారు. అత్యాచార కేసుల్లో ఉండే సున్నితమైన అంశాల పట్ల పోలీసులకు కూడా అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details