కేరళలో ఏనుగు మృతి ఘటనపై ఓ వైపు విచారం, మరోవైపు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. అదే రాష్ట్రంలో మరో ఏనుగు మృతి తాజగా వెలుగులోకి వచ్చింది. అది కూడా ఏదో పేలుడు పదార్థం తినడం వల్లే మరణించి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కొల్లం జిల్లా పతానపురం అటవీ ప్రాంతంలో ఏప్రిల్లో బలహీనంగా ఉన్న ఓ ఆడ ఏనుగును కనుగొన్నామన్నారు. దానికి వైద్యం చేయాలని ప్రయత్నించినా అది సహకరించకుండా కొద్ది దూరం నడిచివెళ్లినట్లు తెలిపారు. మరుసటి రోజు ఓ చోట పడి మరణించిందని స్పష్టం చేశారు.
పోస్టుమార్టం నివేదికలో ఏనుగు దవడ విరిగినట్లు తేలిందని చెప్పుకొచ్చారు అధికారులు. ఫలితంగా ఆ ఏనుగు కూడా ఏదో పేలుడు పదార్థం తినడం వల్లే చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వైద్య పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు చెప్పారు.