ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ధైర్యముంటే దిల్లీ షహీన్ బాగ్ నిరసనల్లో పాల్గొనాలని సవాలు విసిరారు భాజపా అగ్రనేత అమిత్ షా. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నవారికి మద్దతుగా ఉన్నారో లేదో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. దిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రిథాలాలో నిర్వహించిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.
"కేజ్రీవాల్ను ఓ ప్రశ్న అడుగుతున్నా. మీరు షార్జీల్ ఇమామ్ను అదుపులోకి తీసుకోవడానికి అనుకూలమా? కాదా? మీరు షహీన్ బాగ్ ప్రజలకు మద్దతుగా ఉన్నారా? లేదా? అనే విషయం దిల్లీ ప్రజలకు చెప్పండి. షహీన్ బాగ్ ప్రజల వెంటే ఉన్నామని మీరు(ఆప్ నేతలు) చెబుతున్నారు. మీకు దమ్ముంటే వెళ్లి వారితో కూర్చొండి. అంతిమ నిర్ణయం దిల్లీ ప్రజలు తీసుకుంటారు." -అమిత్ షా, కేంద్ర హోంమంత్రి