బంగాల్లో 2021లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో రెండింట మూడొంతుల సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశంలోని శరణార్థులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పౌరసత్వం కల్పిస్తుందని భరోసా కల్పించారు. బంగాల్కు భాజపా నాయకులు రాకుండా అడ్డుకోవటం ఎవరి వల్లా కాదన్నారు.
కోల్కతాలో 'ఇకపై అన్యాయం లేదు (ఆర్ నై అన్యాయ్)' ప్రచారాన్ని ప్రారంభించారు షా. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఏఏను వ్యతిరేకిస్తూ.. బంగాల్లో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
" నేను ఇక్కడికి లోక్సభ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు అనుమతులు ఇవ్వలేదు. హెలికాప్టర్ దిగేందుకు అనుమతించలేదు. వేదికలను ధ్వంసం చేశారు. లాఠీ ఛార్జి చేశారు. తూటాలు పేల్చారు. 40 మంది భాజపా కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా చేసిన మమత నన్ను రాకుండా ఆపగలిగారా? ఇవాళ్టి భారీ ర్యాలీ.. మమత, ఆమె పార్టీ, ఆమె పార్టీలో ఆశ్రయం పొందుతున్న గూండాల అన్యాయాన్ని ఖండించే ర్యాలీ. దీదీ గ్రామాల్లో గల్లీ గల్లీ, ఇల్లు ఇల్లు తిరుగుతూ..దీదీ కే బోలో అనాలని చెప్పింది. దీదీ మీరు ఏమి చెప్పినా ప్రజలు నోరు మెదపకుండా ఉన్నారు. అయితే మీరు మాట్లాడకుండా ఉండొద్దు. దీదీ కే బోలో అని చెప్పినప్పుడు.. మీరు చేసే అన్యాయాన్ని సహించబోమని సమాధానం చెప్పండి. "