అర్హత సాధించినా ఉద్యోగమివ్వలేదు - కాకినాడలో నిరుద్యోగ యువతి ఆందోళన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 5:10 PM IST
Unemployed Young Woman Protest in Kakinada: అర్హత లేనివారికి ఉద్యోగం ఇచ్చి, అన్ని అర్హతలు ఉన్న తన పేరును మెరిట్ లిస్ట్లో తొలగించారని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ) పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ 2023 సెప్టెంబర్ 2న సర్వశిక్షా అభియాన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అల్లవరం గ్రామానికి చెందిన ధరణి అప్లై చేశారు. ఈ పరీక్షలో 58.225 మార్కులతో 21వ ర్యాంకు వచ్చిందని, వెంటనే సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకి వెళ్లి 9.5శాతం అర్హత సాధించానని బాధితురాలు వెల్లడించారు.
Kakinada Unemployed Girl Protest: ఇంటర్వ్యూ అనంతరం అధికారులు రెండు రోజుల్లో ఫోన్ వస్తుందని చెప్పి పంపించారని తెలిపారు. తన తోటి అభ్యర్థులందరికీ జాయినింగ్ కావాలని పిలుపు వచ్చింది. తనకు రాకపోవటంతో అధికారుల వద్దకు వెళ్లి నిలదీస్తే మార్కులు తక్కువ వచ్చాయని, సర్టిఫికెట్లు ఆలస్యంగా పొందుపరిచారని సంబంధం లేని సమాధానాలు ఇస్తున్నారని ధరణి ఆవేదన వ్యక్తం చేశారు. తనకంటే తక్కువ మార్కులు వచ్చి, 24వ ర్యాంకు వచ్చిన వారికి ఎలా ఉద్యోగం ఇస్తారో చెప్పాలని కాకినాడలో విద్యాశాఖ కార్యాలయ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని, అర్హత కలిగిన వారికి ఉద్యోగం కల్పించాలని భారత విప్లవ్ కమ్యునిస్ట్ పార్టీ కమిటీ మెంబర్ కుమార్ డిమాండ్ చేశారు.